టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఏళ్లతరబడి తీర్చిదిద్దిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీ ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కథనాయకులుగా రాంచరణ్, జూ.ఎన్టీఆర్లు నటించారు. ‘బాహుబలి’ రేంజ్లో ఇదికూడా హిట్టవుతుందనే అంచనాలు ఉన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ అనే చిత్రం చరిత్రలో నిలిచిపోతుందని ప్రముఖ సినీ విమర్శకుడు, ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధూ రివ్వూ ఇచ్చారు.
“ఓ భారతీయ ఫిలింమేకర్ సత్తాకు నిదర్శనం ఈ చిత్రం. పెద్ద కలలు కనడమే కాదు, వాటిని సాకారం చేసుకునే క్రమంలో అందరూ గర్వపడేలా ఈ చిత్రం తీశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను చూడకుండా ఉండొద్దు. ఇవాళ దీన్ని బాక్సాఫీసు బ్లాక్ బస్టర్ అనుకోవచ్చేమో గానీ, రేపు మాత్రం ఇదొక క్లాసిక్లా చరిత్రలో నిలిచిపోతుంది. ఇదొక పవర్ ప్యాక్డ్ స్టోరీ. జూనియర్ ఎన్టీర్, రామ్ చరణ్ల నటన అద్వితీయం” అని అన్నారు.
అంతేకాకుండా ‘బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో థ్రిల్లింగ్గా ఉంది. మొదటి నుంచి చివరి సీన్ వరకు నిర్మాణ విలువలు ప్రతిబింబించేలా ఆర్ఆర్ఆర్ చిత్రం ఉంది. ప్రతి నటుడు అత్యున్నత ప్రతిభ కనబర్చారు. ముఖ్యంగా జూ. ఎన్టీఆర్ ఈ సినిమాకు గుండెకాయ లాంటివాడు. అతని పెర్ఫార్మెన్స్ చూస్తే మతిపోతుంది. రాంచరణ్ కూడా తక్కువ ఏం కాదు. సమ్మోహితులను చేశాడు. మొత్తం మీద ఈ సినిమా అందరి మనసును చూరగొంటుంది. ఎన్టీఆర్, రాంచరణ్ల ది తిరుగులేని జోడీ’ అంటూ ఉమైర్ సంధూ సోషల్ మీడియాలో తన రివ్యూ వెలువరించారు.