ఒక్కో కుటుంబానికి..రూ.5లక్షలు, డబుల్ బెడ్ రూం: జి. శ్రీనివాసరావు
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్న ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో ఈ నెల 25వ తేదీన 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహించగా, అందులో నలుగురు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపడంతో మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు, పలువురు నాయకులు డిమాండ్ చేశారు. దాంతో అప్రమత్తమైన అధికారులు.. ఘటనపై వారం రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని వైద్యా అధికారులకు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి. శ్రీనివాసరావు ఆదేశాలు జారీచేశారు.
ఈ క్రమంలో డాక్టర్ జి. శ్రీనివాసరావు నేడు మీడియాతో మాట్లాడుతూ.."కుని ఆపరేషన్లు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా జరిగే ప్రక్రియ. గతేడాది రాష్ట్రంలో 38వేల మందికి పైగా కు.ని. ఆపరేషన్లు నిర్వహించాం. ఇబ్రహీంపట్నంలో ఆపరేషన్లు చేసిన వైద్యుడు చాలా అనుభవజ్ఞుడు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇలాంటి ఘటనలు మొదటసారి. కాజ్ ఆఫ్ డెత్ కోసం నలుగురికి పోస్టుమార్టం నిర్వహించాం. మిగతా 30 మంది ఇళ్లకు వెళ్లి ఆరోగ్య పరిస్థితి మానిటరింగ్ చేస్తున్నాం. 30 మందిలో ఏడుగురిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించాం. మరో ఇద్దరు మహిళలను నిమ్స్కు తరలించాం. చనిపోయిన వారికి రూ.5లక్షల ఎక్స్గ్రేషియా, డబుల్ బెడ్రూం, వారి పిల్లల చదువులకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఈ ఘటనలో ఇద్దరు వైద్యాధికారులపై సస్పెన్షన్ వేటు వేశాము. ఘటనపై విచారణ జరిపి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించాం" అని ఆయన అన్నారు.
"రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనలో నలుగురు మహిళలు మృతి చెందారు. సోమవారం రోజున ఇద్దరు మృతి చెందగా, ఇవాళ ఇబ్రహీంపట్నం మున్సిపల్ సీతారాంపేటకు చెందిన లావణ్య, కొలుకుల పల్లికి చెందిన మౌనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది".