కార్మికులు సమ్మెలో ఉన్నా తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు నడిపించాలనుకుంటున్న ఆర్టీసీ యాజమాన్యానికి బస్సులు ఏమాత్రం సహకరించడంలేదు. ప్రతిరోజూ ఏదో ఒక చోట మొరాయిస్తూనే ఉన్నాయి. తాజాగా బుధవారం కూడా ఓ ఆర్టీసీ బస్సు ఇలాగే కదలకుండా మొండికేసింది. నాగర్కర్నూలు జిల్లా చర్లతిర్మలాపురం వద్ద ఇలా నీటిలో నిలిచిపోయింది.
ప్రతి రోజూ చర్ల తిర్మలాపురానికి వెళ్లే బస్సు మధ్యలో ఓ కాజ్వే పై నిలిచిపోయింది. మార్గ మధ్యలో కేఎల్ఐ కాల్వల ద్వారా వస్తున్న నీటీ కారణంగా బ్రిడ్జ్ పై నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరింది. దాంట్లోకి వెళ్లిన బస్సు మధ్యలోనే ఆగిపోయింది. సెల్ఫ్ స్టార్ట్ కాకపోవడంతో ప్రయాణికులంతా కిందకు దిగి నీటిలో నడుచుకుంటూ వెళ్లారు. కొంత మంది దాన్ని బయటవరకు తోసుకొచ్చి తర్వాత ప్రయాణం సాగించారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. అనుభవంలేని డ్రైవర్ల కారణంగా ఇలా తరుచూ మొరాయిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా బస్సు నీటిలో నిలిచిపోయిన సమయంలో అందులో సుమారు 25 మంది ప్రయాణికులు ఉన్నారు.