మే 17 వరకు లాక్డౌన్ పొడిగించగా.. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్నవారు తమ స్వస్థలాలకు వెళ్లాలని కేంద్రం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే తెలంగాణలో చిక్కుకున్న వలస కార్మికులను వారివారి స్వస్థలాలకు పంపుతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున ప్రత్యేక రైళ్లలో వారిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో తమ సొంత రాష్ట్రాలు, ప్రాంతాలకు వెళ్లేవారు tsp.koopid.ai/epass వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని డీజీపీ మహేందర్రెడ్డి వెల్లడించారు. దరఖాస్తులను పరిశీలించి డిజిటల్ పాసులను జారీ చేస్తామని తెలిపారు.
ఇప్పటికే చాలామంది దరఖాస్తులు చేసుకున్నారని.. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 7వేల పాసులు జారీ చేసినట్లు తెలిపారు. ఇవేగాకుండా మరో 10వేల దరఖాస్తులు పరిశీలించి పాసులు జారీ చేయాల్సి ఉందని చెప్పారు. ఒక్కసారిగా దరఖాస్తులు రావడంతో డిజిటల్ పాసు సర్వర్లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు అధికారులు వివరించారు. కొంత సమయం తర్వాత సంప్రదించాలని తెలిపారు.