మద్యం దుకాణాల్లో ఉద్యోగాలు.. ఏపీ సర్కార్ కొత్త పాలసీ
మద్యం నిషేధానికి ఏపీ ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇకపై మద్యం షాపులను నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ కొత్త ఎక్సైజ్ పాలసీని విడుదల చేసింది. దీంతో మండలాలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించనుంది. ఈ ఏడాది 3,500 మద్యం దుకాణాలను ప్రభుత్వం నిర్వహించనుంది.
బేవరేజెస్ కార్పొరేషనే మద్యం షాపుల ఏర్పాటుకు తగు ప్రదేశాలను గుర్తించనుంది. ఒక్కో మద్యం షాపు 150 నుంచి 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండనుంది. ప్రతి మద్యం దుకాణానికి తెలుగు, ఇంగ్లీషు భాషల్లో నంబర్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. అంతేగాకుండా ప్రతి షాపులో సీసీ కెమెరాలను కూడా అమర్చనున్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి మద్యం షాపుల నిర్వహణ చూస్తారు. ఒక్కో షాపుకు పట్టణ ప్రాంతాల్లో ఐదుగురు, గ్రామీణ ప్రాంతాల్లో నలుగురు సిబ్బందిని నియమిస్తారు. ఉద్యోగులను ఔట్ సోర్సింగ్ విధానంలో నియమించనున్నారు. సూపర్ వైజర్ ఉద్యోగానికి డిగ్రీ అర్హత, సేల్స్మెన్ ఉద్యోగం కోసం ఇంటర్ మీడియట్ అర్హత వుంటే చాలు అంటున్నారు. సూపర్ వైజర్కు రూ.17,500, సేల్స్మెన్లకు రూ.15 వేల జీతం ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మద్యం దుకాణాలను నిర్వహిస్తారు.