ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్లలో ఒకటైన శామ్సంగ్ నుంచి ఓ చేదు వార్త బయటకు వచ్చింది. ఇకపై తక్కువ ఫీచర్లు ఉండే ఫోన్లతో పాటుగా రూ.15,000 లోపు ఫోన్ల విక్రయాల నుంచి కూడా తప్పుకోవాలనే ప్లాన్లో ఉన్నట్లు సమాచారం. ఒకేసారి కాకుండా క్రమంగా చేయనుందని తెలుస్తోంది. కారణం.. రూ.15,000 లోపు ఉన్న ఫోన్లలో లాభాల మార్జిన్ తక్కువ. ఖరీదైన ఫోన్లలో మార్జిన్ ఎక్కువ. అందుకని ఎక్కువ మార్జిన్లు ఉండే విభాగంపైనే దృష్టి పెట్టాలన్నది కంపెనీ ప్రణాళిక అని తెలుస్తోంది. ఇకపై శామ్సంగ్ విడుదల చేసే ఫోన్లు అన్నీ కూడా రూ.15,000కుపైనే ఉంటాయని ఈ వ్యవహారం తెలిసిన ఓ వ్యక్తి వెల్లడించారు.
మరో ముఖ్యమైన కారణం ఏంటంటే.. భారత ప్రభుత్వ ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక (PLI) పథకానికి సహకరిస్తున్న రెండు ప్రధాన బహుళజాతి కంపెనీలలో Samsung ఒకటి. ఈ పథకం కింద ప్రయోజనాలు పొందాలంటే ఫ్యాక్టరీలో ఫోన్ తయారీ ధర రూ.15,000కు పైన ఉండాలన్నది నిబంధన. కనుక ఈ విధంగానూ ప్రయోజనాలు పొందొచ్చన్నది శామ్ సంగ్ ఆలోచన.