టాలీవుడ్లో ఎలాంటి సపోర్ట్ లేకపోయిన కొంతమంది హీరోలను ఆదర్శంగా తీసుకొని, సినిమాలలో నటించాలనే తపనతో అడుగుపెట్టిన వారు చాలామందే ఉన్నారు. అందులో హీరో సత్యదేశ్ ఒకరు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘జ్యోతిలక్ష్మి’ సినిమాలో సత్యదేశ్ తన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అప్పటినుంచి పలు సినిమాల్లో నటిస్తూ, విలక్షణమైన కథలు ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సత్యదేవ్ని మెచ్చుకున్నారు.
నటనలో వైవిధ్యాన్ని చూపించి, అనతి కాలంలోనే విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న సత్యదేవ్ని ప్రశంసిస్తూ గురువారం ట్విట్ చేశారు. మొదటగా సత్యదేవ్.. “అన్నయ్యా నటన, జీవితంలో మాలాంటి ఎందరికో మీరు ఆచార్య. ఒక అభిమానిగా చిరకాలం మీ పేరునే తలచుకుంటాను. మిమ్మల్ని చూసే నటుడిగా మారాను. ఈరోజు మీరు నటించిన ‘ఆచార్య’లో కొద్దిసేపైనా మీతోపాటు కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అదృష్టం నాకు కలిగింది. మీ కష్టం, క్రమశిక్షణ దగ్గరగా నుంచి చూసి నేర్చుకునే అవకాశం దక్కింది” అని ట్విట్ చేశారు.
అనంతరం సత్యదేవ్ ట్విట్పై చిరంజీవి స్పందిస్తూ.. “డియర్ సత్యదేవ్ థ్యాంక్యూ. నీలాంటి చక్కని నటుడు నా అభిమాని కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ‘ఆచార్య’లో తక్కువ నిడివి గల పాత్రలోనైనా నువ్వు కనిపించడం కూడా ఆనందాన్ని ఇచ్చింది. ‘గాడ్ ఫాదర్లో నా అభిమాని నాకు ఎదురు నిలబడే పూర్తి స్థాయి పాత్రలో నటించడం ఇంకా గర్వకారణంగా ఉంది” అని ఆయన రిప్లై ఇచ్చారు.