ఎస్బీఐ తీపివార్త.. వడ్డీ రేట్లు మళ్లీ తగ్గాయ్..
రుణాలు తీసుకునే వారికి ఎస్బీఐ మరోసారి శుభవార్తను వినిపించింది. ఇప్పటి వరకు ఉన్న వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీన్ని సెప్టెంబర్ 10 నుంచి అమలులోకి తీసుకురానున్నారు. ఆర్బీఐ రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వరుసగా ఐదవసారి ఎస్బీఐ తన వడ్డీరేట్లను తగ్గించింది. తాజా నిర్ణయంతో గృహరుణాలు మరింత చౌకగా మారనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అన్నిరకాల కాలపరిమిత రుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది. దీంతో పాటు ఫిక్స్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లను తగ్గించారు. రిటైల్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 20 నుంచి 25 బేసిస్ పాయింట్లు, బల్క్ డిపాజిట్లపై 10 నుంచి 20 బేసిస్ పాయింట్లు తగ్గాయి. ఏడాది కాలపరిమితి ఉన్న ఎంసీఎల్ఆర్ ఆధారిత వడ్డీ రేట్లను 8.25 నుంచి 8.15కు తీసుకువచ్చారు.ఏడాది నుంచి రెండేళ్ల కాలపరిమితి ఉన్న డిపాజిట్లపై 6.70 శాతం నుంచి 6.50 శాతానికి తగ్గింది. కాగా గడిచిన 15 రోజుల్లోనే రెండో సారి ఎస్బీఐ వడ్డీ రేట్లను తగ్గించింది. ఆర్బీఐ రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో వాటిని ఖాతాదారులకే చేర్చేందుకు తాజా నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.