తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి వాతావరణం నెలకొంది. హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. ప్రయాణికులతో బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో 21 టిక్కెట్ కౌంటర్లను ప్రారంభించింది ద.మ. రైల్వే. సాధారణ రోజుల్లో 12 మాత్రమే ఉండేవి. రద్ధీ కారణంగా అదనపు సిబ్బందిని నియమించామని ద.మ. రైల్వే అధికారి సీహెచ్ రాకేష్ తెలిపారు. రైళ్లు ఏ సమయానికి, ఏ ప్లాట్ఫామ్కు వస్తాయనేది ఎప్పటికప్పుడు ప్రకటించడమే కాకుండా.. సహాయకులను అదనంగా సమకూర్చామన్నారు.
టిక్కెట్ తనిఖీ సిబ్బందిని 20 నుంచి 40కి పెంచామన్నారు. టిక్కెట్ తనిఖీ సిబ్బందిని రెట్టింపు చేశామన్నారు. 60 మంది ఆర్పీఎఫ్ సిబ్బంది, 30 మంది జీఆర్పీ నిత్యం విధుల్లో ఉండేలా చూస్తున్నామన్నారు. మరో వైపు రైళ్లలో ఖాళీ ఉండని పరిస్థితి. బస్సుల ఛార్జీలు భారంగా మారడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. రద్దీ దృష్ట్యా భద్రత కట్టుదిట్టం చేశామని సికింద్రాబాద్ రైల్వే డీఎస్పీ నర్సయ్య తెలిపారు.
కాగా ఈ నెల 13, 14 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. లింగంపల్లి-హైదరాబాద్-లింగంపల్లి మధ్య 5 సర్వీసులను, ఫలక్నుమా-లింగంపల్లి-ఫలక్నుమా మధ్య 11 సర్వీసులను, హైదరాబాద్-ఫలక్నుమా-హైదరాబాద్ మధ్య ఒక రైలు సర్వీసును రద్దు చేసినట్లు పేర్కొంది.