నటి షకీలా ఇటీవల నటించిన చిత్రం ‘లేడీస్ నాట్ అలవ్డ్’ చిత్రాన్ని సెన్సార్ బోర్డు తిరస్కరించడంపై.. ఆమె బోర్డు సభ్యులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ చిత్రానికి సెన్సార్ పూర్తి చేయడానికి కొందరు వ్యక్తులు డబ్బులు అడుగుతున్నారని షకీలా ఆరోపించారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు.
తన చిత్రాన్ని తిరస్కరించడానికి గల కారణం ఏంటని సెన్సార్ బోర్డు సభ్యులను ప్రశ్నించారు. ‘ఈ సినిమాకు నేను ఒక నిర్మాతగా వ్యవహరించాను. ఇప్పటికే ఈ సినిమాని సెన్సార్ బోర్డు రెండుసార్లు తిరస్కరించింది. అసలు ఈ సినిమాను ఎందుకు తిరస్కరిస్తున్నారో నాకు అర్థం కావడంలేదు. ఈ జోనర్లో వచ్చిన ఎన్నో చిత్రాలకు సెన్సార్ ఇచ్చారు. కానీ మా చిత్రానికి మాత్రమే సెన్సార్ ఇవ్వడం లేదు. దీనికి గల కారణమేమిటి? నా పేరు ఉండడం మీకు ఇష్టం లేదా? సాయి పేరు ఉండొద్దా? మేమెంతో కష్టపడి, ఫైనాన్స్లో డబ్బులు తీసుకువచ్చి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సెన్సార్ పూర్తి చేయడానికి డబ్బులు అడుగుతున్నారని మా దర్శకుడు సాయి చెప్పారు. చిన్న నిర్మాతలను మాత్రమే డబ్బులు అడుగుతారా? పెద్ద పెద్ద సినిమాలు చేసేవాళ్లని మాత్రం మీరు డబ్బులు అడగరు. ట్రిబ్యునల్కి వెళితే ఎంతో ఖర్చు అవుతుంది. మా చిత్రం ఫ్యామిలీ చిత్రం కాదు. ఇదొక అడల్ట్ కామెడీ సినిమా అని మేము ముందే చెప్పాం. తప్పు ఎక్కడ జరుగుతుందో నాకు తెలుసు. నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి. మీ మంచి కోసం వద్దని అనుకుంటున్నా’ అని షకీలా వారిని హెచ్చరించారు.