గత 10 టెస్ట్ల్లో 1, 17, 20, 2, 10, 23, 22, 10, 12, 8 టీం ఇండియా ఓపెనర్ చేసిన పరుగులు ఇవి. గత 5 సంవత్సరాలుగా 24 టెస్టులు ఆడితే అతడు సగటు కేవలం 27.53 మాత్రమే. 24 టెస్టుల అంటే సుమారు 40కి పైగా ఇన్నింగ్స్ ల్లో కేవలం 3 సెంచరీలు, 3 అర్థసెంచరీలు చేశాడు. ఈ గణాంకాలు చూస్తుంటే ఇప్పటికే అర్థమైపోవాలి ఎవరి గురించి మాట్లాడుతున్నామన్నది. అవును టీం ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ దే ఈ పేలవ ప్రదర్శన. అయిన ఇప్పటికే టీం ఇండియా జట్టులో కొనసాగుతున్నాడు. బీసీసీఐ కేఎల్ రాహుల్కు అపారమైన అవకాశాలను కల్పించింది..ఇంకా కల్పిస్తోంది. మీ వెంట మేమున్నాం నీవు ఇలానే ఆడు అన్నట్లు సిరీస్లు మీద సిరీస్లకు ఎంపిక చేస్తోంది.
ఒకటా, రెండా పదుల సంఖ్యల మ్యాచ్లో విఫలమవుతున్న కేఎల్ రాహుల్కి సెలెక్టర్లు అండగా నిలవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
భారత్ జట్టులో మిగిలిన ఆటగాళ్లకు చేతకాదు..కేఎల్ రాహుల్ ఒక్కడే తోపు అన్నట్టు ఆడించడంపై బీసీసీఐని క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఓ పక్క శుభమన్ గిల్ వంటి ప్రతిభ కలిగిన ఆటగాడు.. మరోపక్క రంజీల్లో పరుగుల వరద పారిస్తున్న యువ ఆటగాళ్లు ఉంటే..పదేపదే రాహుల్కి అవకాశం అందివ్వడంపై ధ్వజమెత్తుతున్నారు. సెలక్షన్ కమిటీ చర్యలతో టాలెంట్ ఉన్న యువ ఆటగాళ్ళు నష్టపోతున్నారని ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
కేఎల్ రాహల్ అంశంపై రాజకీయనాయకులు కూడా స్పందించడం చర్చనీయాంశమైంది. కేఎల్ రాహుల్ జట్టులో కొనసాగించడంపై కాంగ్రెస్ ఎంపీ శశీ థరూర్ ట్వీట్ చేశారు. టీమిండియా సెలెక్షన్ విధానాన్ని తప్పుబడుతూ సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా చేసిన ట్వీట్కు బదులుగా స్పందించిన శశి థరూర్.. బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన ట్వీట్లో సంజూ శాంసన్ అంశాన్ని ప్రస్తావించాడు శశి థరూర్. ‘సంజూ శాంసన్ పరిస్థితి ఏంటి? వన్డేల్లో 76 సగటు ఉన్న ప్లేయర్ను మరోసారి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు పట్టించుకోలేదు. విఫలం చెందిన వారికి అవకాశాలు ఇవ్వడం సరే కానీ.. ప్రతిభావంతులకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు” అని శశీ థరూర్ ప్రశ్నించారు. శశీథరూర్ ట్వీట్పై స్పందించిన అభిమానులు.. టీమిండియా సెలెక్షన్పై పార్లమెంట్లో చర్చించాలని కోరారు. అదే విధంగా సౌతిండియా ఆటగాళ్లకు జరగుతున్న అన్యాయంపై గళమెత్తాలని డిమాండ్ చేశారు.
And what about @IamSanjuSamson ? Averaging 76 in ODIs and yet again omitted from the ODI squad against Australia. It’s all very well to give non-performers a long rope but surely not at the expense of talented performers? https://t.co/tg56JJMTue
— Shashi Tharoor (@ShashiTharoor) February 21, 2023
ప్రస్తతుం బోర్డర్ -గావస్కర్ ట్రోఫీలో భాగంతో ఆస్ట్రేలియాపై రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. రెండు టెస్టుల్లో అత్యధికంగా 20 పరుగులు మాత్రమే చేశాడు. అయినా అతడిని మిగతా రెండు టెస్ట్లకు బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే అతడి వైస్ కెప్టెన్సీ పదవి నుంచి మాత్రం తప్పించింది. దీంతో మూడో టెస్ట్లో బరిలోకి దిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.