అత్త కాదు అమ్మ.. వితంతు కోడలికి రెండో పెళ్లి
అత్తాకోడళ్ల గొడవలు సాధారణమే. కానీ, కొందరు అత్తా కోడలు తల్లీ కూతుళ్లను తలపిస్తారు. ఒడిశా రాష్ట్రంలో జరిగిన ఓ తాజా సంఘటనే ఇందుకు నిదర్శనం. అనుగుల్ జిల్లా గోబరా గ్రామానికి చెందిన మాజీ సర్పంచి ప్రతిమ బెహరా తన కోడలు విషయంలో అమ్మ పాత్ర పోషించింది. 20 ఏళ్ళ ప్రాయంలోనే వితంతువైన కోడలికి తానే వరుడిని చూసి మళ్ళీ వివాహం చేసింది. 2019 ఫిబ్రవరిలో ప్రతిమ బెహరా కొడుకు రష్మీ రంజన్కు.. తురాంగ గ్రామానికి చెందిన లిల్లీతో పెళ్లి జరిగింది.
అయితే పెళ్లైన ఐదు నెలల తర్వాత కొడుకు గని ప్రమాదంలో చనిపోయాడు. దీంతో లిల్లీ బెహరా వితంతువుగా మారింది. కోడలి బాధను చూసి చలించిన అత్త ప్రతిమ బెహరా కొత్త జీవితం అందించాలని నిర్ణయించుకుంది.
తన కోడల్ని పెళ్లి చేసుకోవాలని తన బంధువు కుమారుడు సంగ్రామ్ను ఒప్పించింది. అనుగుల్లోని జగన్నాథ ఆలయంలో లిల్లి తల్లిదండ్రుల సమక్షంలో పెళ్లి జరిపించింది. సొంత కూతురి మాదిరిగా వితంతువైన కోడలిని మళ్లీ పెళ్లి చేసి అన్ని సంప్రదాయాలతో అత్తారింటికి పంపింది.