నేటి నుంచే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం..ఉల్లంఘిస్తే ఇక అంతే
భారతదేశంలో నేటి నుంచే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (ఎస్యూపీ) నిషేధం అమల్లోకి రానుందని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. కేంద్ర నిబంధనలను, నిషేధాన్ని ఉల్లంఘిస్తే గనుకు పర్యావరణ పరిరక్షణ చట్టం(ఈపీఏ)లోని సెక్షన్ 15, సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ల నిబంధనల కింద భారీ జరిమానా, జైలుశిక్ష రెండూ ఉంటాయని హెచ్చరించారు.
అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ.."జూలై 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒకసారి వినియోగించి పడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం అమలుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) చర్యలు తీసుకుంటుంది. ఇందుకు సంబంధించి జాతీయ, రాష్ట్రస్థాయిల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటవుతాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (ఎస్యూపీ) వస్తువుల తయారీ, పంపిణీ, నిల్వ, పంపిణీ, అమ్మకం, వినియోగాన్ని తనిఖీ చేసేందుకు ప్రత్యేక బృందాలు పని చేస్తాయి. రాష్ట్రాల మధ్య ఎస్యూపీ వస్తువుల రవాణాను అరికట్టేందుకు సరిహద్దులో చెక్ పాయింట్లను ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్రాలను, యూటీలను కోరింది. ఈ నిషేధం అమలులో సహకరించేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) పౌరులకు కూడా అవకాశం కల్పించింది. ఓ గ్రీవెన్స్ రిడ్రెసల్ అప్లికేషన్ను కూడా లాంచ్ చేసింది." అని ఆయన అన్నారు.
నిషేధిత జాబితాలోకి వచ్చే ప్లాస్టిక్ వస్తువులు ఇవే..
ఇయర్బడ్స్, బెలూన్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, పిప్పరమెంట్లకు వాడే ప్లాస్టిక్ పుల్లలు (క్యాండీ స్టిక్స్), ఐస్క్రీమ్ పుల్లలు, అలంకరణ కోసం వాడే థర్మోకోల్ షీట్లు, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులతోపాటు ప్లాస్టిక్ గ్లాసులు, ఫోరులు, కత్తులు, స్పూన్లు, స్ట్రాలు.. వేడి పదార్థాలు, స్వీట్ బాక్సుల ప్యాకింగ్కు వాడే పల్చటి రేపర్స్, సిగరెట్ ప్యాకెట్లు, 100 మైక్రాన్ల లోపు ఉండే ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లు, ద్రవ పదార్థాలను కలిపేందుకు వాడే పుల్లలు.