దక్షిణ మధ్య రైల్యే ప్రయాణికులకు, పర్యాటకులకు శుభవార్త చెప్పింది. ప్రయాణికులు, పర్యాటకులు ఇకనుంచి రైల్యే స్టేషన్లో ఎంచక్కా విశ్రాంతి తీసుకోనేలా రెండు గంటల నుంచి రెండు రోజులపాటు ఉండేలా విశ్రాంతి గదులను ఏర్పాటు చేసింది.
రెల్యే అధికారులు మాట్లాడుతూ..”ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం హైదరాబాద్ నగరానికి వచ్చే ప్రయాణికులు, సిటీటూర్ కోసం వచ్చేవారు ఏ హోటల్లోనో బస చేయాల్సిన అవసరం లేకుండా అన్ని సదుపాయాలతో రైల్వే స్టేషన్లలోనే ఉండేందుకు రిటైరింగ్ రూమ్లను అందుబాటులోకి తెచ్చాం. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లలో సుమారు 30 విశాలమైన విశ్రాంతి గదులు, డార్మిటరీలను ప్రయాణికుల కోసం కేటాయించాం. వేసవి పర్యటనల కోసం నగరానికి వచ్చే పర్యాటకులతో విశ్రాంతి గదులకు భారీ డిమాండ్ పెరిగింది. స్టార్హోటళ్లు, లాడ్జీల కంటే తక్కువ ధరలకే ఈ విశ్రాంతి గదుల ధరలు నిర్ణయించాం”.
మరోపక్క సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి ప్రతిరోజు సుమారు 2 లక్షల మందికిపైగా ప్రయాణం చేస్తుంటారు. వేసవి సెలవుల కారణంగా ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి దక్షిణాది పర్యటనకు వెళ్లేవారు హైదరాబాద్ను విడిదిగా ఎంపిక చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రైల్యే అధికారులు.. ఏసీ, నాన్ ఏసీతో కూడిన విశ్రాంతి గదులను ఏర్పాటు చేశారు. ఆ గదుల్లో స్నానపు గదులు, టీవీ, తాగునీరు వంటి అన్ని సదుపాయాలను కల్పిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.