భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమైయ్యాయని ఆలయ అర్చకులు తెలిపారు. పాల్గుణ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం స్వామివారికి విశేష పూజలను నిర్వహించారు. ప్రధాన ఆలయంలోని మూలమూర్తులు, ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. ”ఆలయంలోని చిత్రకూట మండపంలో వైష్ణవ సాంప్రదాయం ప్రకారం స్థానాచార్యులు స్థల సాయి నేతృత్వంలో రోలు, రోకలికి దేవతలను ఆవాహన చేసి, పసుపు దంచే కార్యక్రమాన్ని నిర్వహించాం. అలా తయారు చేసిన పసుపుతో తలంబ్రాలను సిద్ధం చేశాం. ఏప్రిల్ 9న సీతారాములుకు ఎదుర్కోలు ఉత్సవం, 10న కల్యాణోత్సవం, 11న పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి” అని తెలిపారు.
మరోపక్క ఏప్రిల్ 10న శ్రీరామనవమిని పురస్కరించుకొని నేటి నుంచి సంప్రదాయబద్ధంగా ఆలయ అధికారులు నవమి ఉత్సవాల పనులను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆలయంలోని చిత్రకూట మండపంలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం స్థానాచార్యులు స్థల సాయి నేతృత్వంలో రోలు, రోకలికి దేవతలను ఆవాహన చేసి పసుపు దంచే వేడుకను వైభవంగా చేపట్టారు.