తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ది చెందిన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో మహాకుంభ సంప్రోక్షణకు సర్వం సిద్ధమయింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేసీఆర్ దంపతులతోపాటు, తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇప్పటికే కేసీఆర్, మంత్రులు యాదాద్రికి చేరుకున్నారు. ఈ మేరకు శ్రీలక్ష్మీ నరసింహ స్వామి శోభాయాత్ర బాలాలయం నుంచి ప్రారంభమైంది.
ఈ క్రమంలో నేటీ ఉదయం 11.55 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ ప్రారంభం కానుంది. అనంతరం గర్భాలయంలో కేసీఆర్ తొలి పూజ చేయనున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములైన వారిని ఉత్తర రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద కేసీఆర్ సన్మానించనున్నారు. ఆ తర్వాత యాగశాల స్థలం వద్ద మధ్యాహ్న భోజనాలు చేస్తారు.
మరోపక్క మరికాసేపట్లో భక్తులకు యాదాద్రి నృసింహుడు నిజరూప దర్శనం ఇవ్వనున్నారు. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత స్వయంభు స్వామివారు గర్భాలయంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ నెల 21న ప్రధానాలయ ఉద్ఘాటన క్రతువుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అష్టభుజి ప్రాకార మండపాలు, సింహయాళీ, కాకతీయ స్తంభాలు, పురాణ ఇతిహాసాలను రాతి శిలలపై పదిలపరుస్తూ ఎన్నో విశేషాలతో పాంచనరసింహుల పునర్నిర్మాణం, విస్తరణ పూర్తయింది.