మొదలైన తెలంగాణ కేబినెట్ సమావేశం.. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న హరీశ్ రావు!
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత జరిగిన పూర్తిస్థాయి తొలి మంత్రివర్గ సమావేశం ఇదే. సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో 2019-20 వార్షిక బడ్జెట్ను ఆమోదించనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, నూతన అసెంబ్లీ, సచివాలయం నిర్మాణం, బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఇతర అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో సోమవారం ప్రవేశపెట్టే బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలుపనున్నది.
కాగా, ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మరొక ప్రత్యేకత ఏంటంటే ఆర్థికశాఖ మంత్రిగా ఎన్నికైన తన్నీరు హరీశ్ రావు రేపు తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇంతకాలంగా ఆర్థికశాఖ ఎవరికీ కేటాయించకపోవడంతో ఈ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆరే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారని ప్రచారం జరిగింది. అయితే తాజా మంత్రివర్గ విస్తరణతో ఆర్థిక మంత్రిగా హరీశ్ రావు ఎన్నికవడంతో ఆయనే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.