వైట్ స్టార్ లైన్ అనే సంస్థ కోసం హర్లాండ్ అండ్ వోల్ఫ్ అనే నౌకా నిర్మాణ సంస్థ తయారు చేసిన… ప్రపంచ ప్రఖ్యాత మూడు నౌకల్లో ఒకటి టైటానిక్.1912 లో మొదటిసారిగా ప్రవేశ పెట్టినపుడు ప్రపంచంలోకెల్లా అదే అతి పెద్ద ప్రయాణ నౌక. దాని మొదటి ప్రయాణంలోనే ఏప్రిల్ 14, 1912 వ తేదీఅర్థరాత్రి ప్రమాదవ శాత్తూ ఒక మంచు కొండను ఢీకొని సము ద్రంలో మునిగిపోయింది. 1514 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. దీనివలన ఇదిఅపకీర్తిని మూటగట్టుకోవడమే కాకుండా, చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన సంఘటనలలో ఒకటిగా మిగిలిపోయింది.
దీని నిర్మాణంలో అప్పట్లో ఉండే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వలన అది మునిగి పోవడం అసాధ్యం అని జనాలు నమ్మేవారు. కానీ ఎంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా, ఎంతమంది అనుభవజ్ఞులైన సిబ్బంది ఉన్నా, అది అలా మునిగిపోయి అపార ప్రాణనష్టాన్ని కలిగించడం చాలామందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. టైటానిక్ బాధితుల గురించి మాధ్యమాల ప్రచారం, నౌకలో జరిగినట్లుగా చెబుతున్న ప్రధాన సంఘటనలు, ఈ సంఘటన పర్యవసానంగా కొత్తగా ప్రవేశపెట్టబడిన నౌకాయాన న్యాయ నియమాలు, 1985లో రాబర్ట్ బల్లార్డ్ నేతృత్వంలో కనుగొనబడిన టైటానిక్ అవశేషాలు, ఈ నౌకకు అత్యంత ప్రాముఖ్యతను సంపాదించి పెట్టాయి.
తయారైందిలా…
టైటానిక్ నౌక వైట్ స్టార్ లైన్ అనే సంస్థ కోసం ఐర్లాండు లోని బెల్ఫాస్ట్ కు చెందిన హర్లాండ్ అండ్ వోల్ఫ్ అనే నౌకా నిర్మాణ సంస్థ తయారు చేసిన మూడు నౌకల్లో ఒకటి. వైట్ స్టార్ లైన్ ప్రధాన పోటీదారైన కునార్డ్ లైన్స్ లూసిటానియా, మౌరిటానియాకు పోటీగా తయారు చేయబడింది. టైటానిక్,దీని సోదర నౌకలైన ఒలంపిక్, బ్రిటానిక్ నౌకలూ కలిపి ప్రపంచంలో అతి పెద్దవైన విలాసవంతమైన నౌకలుగా పేరు తెచ్చుకున్నాయి.
టైటానిక్ నిర్మాణం మార్చి 31, 1909 లో అమెరికాకు చెందిన జేపీ మోర్గన్, ఇంటర్నేషనల్ మర్చంటైల్ మెరైన్ కంపెనీ సమకూర్చిన నిధులతో ఆరంభమైంది. దీని ప్రధాన శరీర భాగం 1911, మే 31 కి పూర్తయింది. ఇతర విడిభాగాల కూర్పు మార్చి 31, 1912కి పూర్తయింది. ఇది 882అడుగుల 9 అంగుళాలు (269 మీటర్లు) పొడవు, 92 అడుగుల 6 అంగుళాల (28మీటర్ల) వెడల్పు, నీటితలం నుంచి 60 అడుగులు (18 మీటర్లు)ఎత్తులోనూ ఉండేది. ప్రయాణికులు, నౌకా సిబ్బంది మొత్తం కలిపి ఇది 3547 మందిని మోయగలదు. దీని ద్వారా అప్పుడు ఉత్తరాల బట్వాడా జరుగుతుండటంతో దీనికి రాయల్ మెయిల్ స్టీమర్ అనే పేరును కూడా తగిలించారు. అప్పటి నియమాల ప్రకారం ఈ నౌకలో సరిపడా లైఫ్ బోట్లున్నా నౌకలోని ప్రయాణికులందరికీ అవి సరిపోలేదు.
టైటానిక్ విశేషాలు…
ఆ కాలంలో టైటానిక్ నౌక విలాసంలోనూ, సౌకర్యంలోనూ దాని ప్రత్యర్థి నౌకలన్నింటినీ తోసిరాజంది. నౌకలోనే ఈతకొలను, వ్యాయామశాల, టర్కిష్ బాత్, రెండు తరగతుల ప్రయాణికులకు గ్రంధాలయాలు, స్క్వాష్ కోర్టును కలిగి ఉండేది. మొదటి తరగతిలోని ఉమ్మడి గదులు, ఖరీదైన చెక్కతోనూ ఆకర్షణీయమైన అలంకరణలతోనూ, నిండి ఉండేది. మొదటి తరగతి ప్రయాణికులకు కెఫే పరీసియన్ శైలిలో వంటకాలు లభించేవి. ట్రెల్లిస్ అలంకరణలు చేయబడ్డ కొద్దిపాటి సూర్యరశ్మిని ప్రసరింపజేసే వరండా డైనింగ్ హాలులా ఉండేది.
ఈ నౌకలో, ఆ కాలంలో అప్పుడే కొత్తగా అభివృద్ధి చెందిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడడం జరిగింది. విస్తృతమైన విద్యుధీకరణ వ్యవస్థ,నీటి ఆవిరితో నడిచే జనరేటర్లు ఉండేవి. రెండు శక్తివంతమైన మార్కోని రేడియో సెట్లు కూడా ఉండేవి. వీటిలో ఒకటి 1500 వాట్ల శక్తివంతమైనది. వంతుల వారీగా విధులు నిర్వర్తించే ఆపరేటర్లతో రేయింబవళ్ళు నడపబడుతుం డటం మూలాన ఇది మిగతా ప్రపంచంతో ఎడతెరిపిలేని సంబంధాలు కలిగి ఉండేది.
తొలి ప్రయాణమే చివరి మజిలీ…
టైటానిక్ నౌక మొట్టమొదటి ప్రయాణమే చిట్టచివరి ప్రయాణం. ఇంగ్లాండులోని సౌథాంప్టన్ నుంచి న్యూయార్క్ నగరం వరకూ సాగవలసినది. ఎడ్వర్డ్ జె స్మిత్ నావికుడిగా ఈ ప్రయాణం, 1912, ఏప్రిల్ 10 బుధవారం ఆరంభమైంది. టైటానిక్ దాని స్థానం నుండి బయలుదేరగానే దానీ శక్తివంతమైన ప్రొపెల్లర్లు విడుదల చేసిన శక్తి వలన దాని పక్కనే లంగరు వేసి ఉన్న న్యూయార్క్ లైనర్ కట్లు తెంచుకుని టైటానిక్కు సుమారు నాలుగు అడుగుల దూరం వరకూ వచ్చింది. కానీ అప్రమత్తమైన సిబ్బంది ఈ ప్రమాదం నుంచి కాపాడగలిగారు. ఇదే ఈ నౌక ప్రయాణానికి తొలి అపశకునం. దీని వలన నౌక ప్రయాణం ఆరంభమవడం గంట పాటు ఆలస్యమైంది. ఇంగ్లీష్ ఛానల్ ను దాటిన తరువాత ఫ్రాన్సు లోని చెర్బోర్గ్ వద్ద ఆగి మరి కొంతమంది ప్రయాణికులను ఎక్కించుకున్నది. తరువాత ఐర్లండులోని క్వీన్స్టౌన్ వద్ద కూడా ఆగి మొత్తం 2240 మంది ప్రయాణికులతో న్యూయార్క్ వైపు ప్రయాణం మొదలు పెట్టింది.
ఘోర ప్రమాదం…
ఏప్రిల్ 14 ఆదివారం రాత్రి. చలికి దాదాపుగా గడ్డకట్టుకుపోయే ఉష్ణోగ్రత. సముద్రం నిశ్చలంగా ఉంది. చంద్రుడు కనపడడం లేదు. ఆకాశం నిర్మలంగా ఉంది. గత కొద్ది రోజులుగా మంచు కొండల గురించి వైర్ లెస్ ద్వారా సమాచారం అందుకుంటున్న నౌక కెప్టెన్ స్మిత్ నౌకను కొద్దిగా దక్షిణం వైపుకు మళ్ళించమని సిబ్బందిని ఆదేశించాడు. ఆరోజు మధ్యాహ్నం 1:45 సమయానికి అమెరికా అనే స్టీమరు టైటానిక్ నౌక వచ్చే దారిలో భారీ మంచు పర్వతాలు ఉండవచ్చునని చేసిన హెచ్చరికలు దురదృష్టవశాత్తూ నౌకను నియంత్రించే బ్రిడ్జ్ గదికి చేరలేదు. సాయంత్రంమెసాబా అనే నౌక నుంచి వచ్చిన అలాంటి హెచ్చరికలు కూడా నియంత్రణ గదికి చేరలేదు.
రాత్రి 11:40 సమయంలో టైటానిక్ న్యూఫౌండ్ లాండ్స్ (ఉత్తర అమెరికాకు సమీపంలో ఉండే ఒక పెద్ద ద్వీపం) వద్దగల గ్రాండ్ బ్యాంక్స్ (సముద్రం లోపల ఉండే పీఠభూముల్లాంటి ప్రదేశాలు) లో ప్రయాణిస్తోంది. నౌకకు ముందుగా దాని దారిలో పయనిస్తూ సమాచారాన్ని అందిస్తూ హెచ్చరికలు చేస్తూ వెళ్ళే ఫ్రెడెరిక్ ఫ్లీట్, రెజినాల్డ్ లీ టైటానిక్ కు ఎదురుగా పెద్ద మంచు పర్వతాన్ని కనుగొన్నారు. ఫ్లీట్ కుడి వైపు మంచుపర్వతముందని చెబుతూ బ్రిడ్జి గదికి వెళ్ళే గంటను మోగించాడు. నౌకాధికారి ముర్డోక్ నౌకను ఉన్నపళంగా ఎడమ వైపుకు మళ్ళించమని ఆదేశించాడు. ఇంజన్ ఒక్కసారి ఆగి పోయి మళ్ళీ తిరిగి పరిగెత్తడం ఆరంభించింది. కానీ నౌక పర్వతాన్ని గుద్దుకోవడం మాత్రం అనివార్యమైంది. ఈ గుద్దుకోవడంలో నౌక కుడి భాగం వైపు 300 అడుగుల పొడవు మేరకు నౌక ప్రధాన భాగం రాపిడికి గురై నిర్మాణంలో వాడిన రివెట్లను బయటపడేసింది.
సముద్రపు నీరు ముందు భాగపు గదులను నింపేస్తుండటంతో వాటి తలుపు వాటంతట అవే మూసుకుపోయాయి. నాలుగు కంపార్ట్మెంట్లు నీటితో నిండిపోయినా టైటానిక్ తేలగలిగి ఉండేదే కానీ ఐదు కంపార్ట్మెంట్లూ నీటితో నిండిపోవడం ప్రారంభించాయి. ఈ విధంగా మునిగిపోవడం వలన నీరు పైన ఉండే కంపార్ట్మెంట్లకు కూడా ఎగదన్నింది. ప్రమాదాన్ని గుర్తించిన కెప్టెన్ స్మిత్ బ్రిడ్జ్ గదిలోకి వచ్చి నౌకను పూర్తిగా ఆపివేయమని ఆదేశించాడు. ఏప్రిల్ 14 అర్ధరాత్రి తరువాత థామస్ ఆండ్రూస్ ఇతర నౌకాధికారులు పరీక్షించి లైఫ్ బోట్లను సమాయత్త పరచమని పురమాయించారు.
మొదటి లైఫ్ బోటు ఏడవ నంబరు బోటు అందరూ నమ్ముతున్నట్లుగా 12:40 కి కాక 12:27 కి 12 మంది ప్రయాణికులతో క్రిందకు దించబడింది. ఐదవ నంబరు బోటు రెండు మూడు నిమిషాల తర్వాత దించబడింది. టైటానిక్లో మొత్తం 1178 మందిని కాపాడగలిగే ఇరవై లైఫ్ బోట్లు ఉండేవి. ఇవి నౌకలోని మొత్తం సిబ్బంది, ప్రయాణికులకు సరిపోకపోయినా అప్పటి బ్రిటీష్ నియమాల ప్రకారం కావల్సిన దానికన్నా ఎక్కువ బోట్లే ఉన్నాయి. అప్పట్లో నౌకలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న దాని కన్నా, నౌక ఎంత బరువున్నదాన్ని బట్టి బోట్ల సంఖ్యను లెక్కించే వారు.
వైర్లెస్ ఆపరేటర్లయిన జాక్ ఫిలిప్స్, హరాల్డ్ బ్రైడ్ ప్రమాద సంకేతాలను నలుదిక్కులకు పంపించడం ప్రారంభించారు. మౌంట్ టెంపుల్, ఫ్రాంక్ఫర్ట్,టైటానిక్ సోదర నౌక ఒలంపిక్, వంటి చాలా నౌకలు తిరిగి సమాధానం కూడా ఇచ్చాయి. కానీ ఏ నౌకా సమయానికి దగ్గర్లో లేక పోయింది. అన్నింటికన్నా దగ్గర్లో ఉన్న నౌక కునార్డ్ లైన్స్ కి చెందిన కర్పతియా (58 మైళ్ళ దూరంలో ఉన్నది). కానీ అది ప్రమాదస్థలికి చేరుకొనేటప్పటికే చాలా ఆలస్యమైపోయింది. టైటానిక్ పంపించిన అపాయ సందేశాన్ని అందుకున్న ఏకైక భూతల వైర్లెస్ స్టేషన్ న్యూఫౌండ్ల్యాండ్లో గల క్యాప్ రేస్.
అవశేషాల అన్వేషణ…
టైటానిక్ మునిగిపోయిన కొద్ది కాలానికే దాని అవశేషాలను కనుగొనాలని, వీలైతే దానిని సముద్రగర్భం నుంచి బయటకు తీసుకురావాలని ఆలోచనలు చేశారు కానీ సెప్టెంబర్ 1, 1985 వరకూ అవి ఏవీ కార్యరూపం దాల్చలేదు. తరువాత వోడ్స్ హోల్ సముద్ర పరిశోధనా సంస్థకు చెందిన జీన్ లూయిస్ మైకేల్, రాబర్ట్ బల్లార్డ్ నేతృత్వంలో సముద్రం అడుగు భాగంలో 2 మైళ్ళ లోతులో నౌక అవశేషాలను కనుగొనడం జరిగింది.
ఈ పరిశోధనలో బయటపడిన ప్రధానమైన అంశాలేమిటంటే… నౌక రెండుగా విడిపోయిందని కనుగొనడం. ముందు భాగం, వెనుక భాగం విడిపడిపోయి ఒకదానికొకటి వ్యతిరేక దిశలో 600 మీటర్ల దూరంలో పడి ఉన్నాయి. ఈ అన్వేషణలకు ముందు అమెరికన్, బ్రిటీష్ విచారణలు కూడా నౌక రెండుగా విడిపోలేదని తేల్చాయి. అంతేకాక ఇది రెండుగా విడిపోయిందా? లేదా అన్న విషయంపై విభిన్న కథనాలు వినిపించేవి.
నవలలు, సినిమాలు…
తదనంతర కాలంలో టైటానిక్ ఇతివృత్తంగా అనేక కాల్పనిక నవలలు, సినిమాలు విడుదలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన కొన్ని నెలల తర్వాత దీన్ని గురించి కొన్ని మూల గ్రంథాలు కూడా రాయడం జరిగింది. ప్రమాదం నుంచి బయటపడిన లైటోలర్, జాక్ థయర్ వంటి వారు తమ అనుభవాలను గ్రంథస్తం చేశారు. వాల్టర్ లార్డ్ అనే రచయిత స్వయంగా టైటానిక్లో ప్రయాణించిన వ్యక్తులను కలిసి, పరిశోధన చేసి, అసలు నౌకలో ఏం జరిగిందో వర్ణించాడు.
మునక వెనక లోపాలెన్నెన్నో…
269 మీటర్ల పొడవు, 28మీటర్ల వెడల్పు, 53మీటర్ల ఎత్తు, 51,000ల అశ్వసామర్ధ్యం ఒకటిగా కలిస్తే అది టైటానిక్. నాటి నిర్మాణ వ్యయం10మిలియన్ డాలర్లు. (ప్రస్తుతం అది 213 మిలియన్ డాలర్లతో సమానం). బ్రిటిష్ నౌక కంపెనీ అయిన వైట్స్టార్ లైన్ నమ్మకం ప్రకారం టైటానిక్కు మునగనే మునగదు. పరిమాణంలోనే కాదు విలాస సదుపాయాల రీత్యాను టైటానిక్ను తలదన్నిన నౌక ఇప్పటికీ రాలేదంటే అతిశయోక్తి కాదు. కేవలం శతకోటీశ్వరులు మాత్రమే ఇందులో సూట్ బాడుగ తీసుకోగలిగేవారు. రోజుకు వచ్చి ఒక సూట్కు నాడు వసూలు చేసే 4,400 డాలర్లు.ఇప్పటి 93,000 డాలర్లకు సమం. నౌక మునక కారణంగా ప్రమాద సమయంలో టైటానిక్లో ఎందరు ప్రయాణికులున్నారనేది నిర్దిష్టంగా తెలియదు.
లోపాలెన్నో…
ప్రయాణ సమయంలో నౌకలో సుమారు 20 లైఫ్బోట్లున్నాయి. 1,200లమందికి ఇవి సరిపోతాయి. టైటానిక్ పరిమాణం అందులోని ప్రయాణికుల సంఖ్యతో బేరీజు వేస్తే ఇవి ఏమాత్రం చాలవు. సముద్ర ఉపరితల వీక్షణకు నావికులు సహజంగా ఉపయోగించే టెలిస్కోపులు లేవు. ఫలితంగానే మంచు పర్వతాన్ని గుర్తించలేక పోయారు గుర్తించిన తరువాత కూడా టైటానిక్ కెప్టెన్ తీసుకున్న అదనపు జాగ్రత్తలు ఏమీ లేవు. వాస్తవానికి కెప్టెన్కు హెచ్చరికలు బట్వాడా చేయాల్సిన రేడియో ఆపరేటరు విధుల్లో లేడు. నిద్రిస్తున్నాడు. హడావుడిలో జారీ అయినా మహిళలు, పిల్లలు అనే ఆదేశాల అమలు కొంత గందరగోళానికి దారి తీసింది.
ఫలితంగా అత్యంత విలువైన సమయం వృధా అయింది. ప్రమాదాన్ని నౌకలో అందరికి సకాలంలో చేరవేయడంలోను లోపాలు దొర్లాయి. ఫలితమే నౌక మునక. టైటానిక్ మంచు కొండలను ఢీకొన్న సమాచారం తెలియగానే దగ్గరకు చేరిన తొలి పడవ ఆర్ఎంఎస్ కార్పతియా. ఢీకొన్న తరువాత మునుగుతున్న నౌక నుంచి ప్రాణాలు కాపాడుకోవాలని సముద్రంలో దూకిన ప్రయాణికులు అతిశీతలంగా ఉన్న సముద్ర జలాల్లో గడ్డకట్టి ఊపిరందక మరణించారు.
మృత్యుంజయులు…
ఇంతటి విషాదంలో ప్రాణాలతో బయట పడిన చివరి వ్యక్తి మిల్విన డీన్ నాడు నౌకలో ప్రయాణించే ఇద్దరు బాలికల్లో ఒకరు. 2009 మే 31న మిల్విన తుది శ్వాస విడిచింది. ఈమె తన 97 ఏళ్ళ వయసులో ఇంగ్లాండ్లో మరణించింది. అమెరికాలోని కన్సాస్లో విచిటాలోవ్యాపారం మొదలుపెట్టి ఆనందకరమైనజీవితం గడుపుదామనే ఆలోచనతో మిల్విన్ తొమ్మిది వారాల శిశువుగా ఉండగానే ఆమె తండ్రి బెర్త్రామ్ తనకున్న పబ్ను అమ్మేసి వచ్చిన సొమ్ముతో టైటానిక్ ఓడ ఎక్కాడు. టైటానిక్ దుర్ఘటనలోప్రాణాలతో బయటపడిన 706 మందిలో మిల్విన్ డీన్ అత్యంత పిన్న వయసుబాలిక. ఆమె తల్లి జార్జెట్టా, రెండు సంవత్సరాల సోదరుడు బెర్త్రామ్ల ప్రాణాలు దక్కినా 1975లో తల్లి, 1992లో సోదరుడుమరణించారు. టైటానిక్దుర్ఘటన గురించి తొలిసారిగా తనకు ఎనిమిదేళ్లవయసున్నపుడు తెలిసిందని డీన్ తెలిపింది. డీన్ కూడా అవివాహితగానే జీవనం సాగించింది.70ఏళ్ల వయసులో కానీ డీన్ టైటానిక్ ప్రముఖురాలు కాలేకపోయింది.
కళ్లెదుటే సముద్రగర్భంలోకి…
ఏప్రిల్ 24, 1912న 24 సంవత్సరాల జాన్ స్నైడర్ తన తండ్రి ఫ్రాంక్కు రాసిన లేఖలో ఏప్రిల్ 14 నాటి టైటానిక్ మునక చేదు అనుభవాలను నెమరు వేసుకున్నాడు. జాన్ స్నైడర్ అతని భార్య నెల్లి అదృష్టవశాత్తు టైటానిక్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. అట్లాంటిక్ మహాసముద్రంలో అత్యంత భీకరమైన ఈ విషాదఘట్టానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఈ జంట, తమ హానీమూన్ ముగించుకొని వస్తుండగా ఈ ఘోరం చోటు చేసుకుంది. జాన్ సై్నడర్ రాసిన ఉత్తరం సారాంశం…
ఏప్రిల్ 24, 1912,
ప్రియమైన నాన్నగారూ,
ఇక్కడ మేం కుశలంగా ఉన్నాం.. ఇంటికి చేరుతున్న ఈ ఆనందానికి దైవానికి కృతజ్ఞత లు. బహుశా మేం ఈ ప్రమాదం నుంచి ఎలా సురక్షితంగా బయటపడ్డామో మీకు తెలిసి ఉండకపోవచ్చు.ఈ విషయంలో నేను ఎవరూ గుర్తించని కొన్ని సంగతులు మాత్రం చెప్పగలను. అదేమి టంటే దేవునితోపాటు నా భార్యకు కూడా నే ను ఈ రోజున బ్రతికి ఉన్నందుకు మీరంతా కృతజ్ఞతలు తెలపాలి. అసలు నా భా ర్య నెల్లి అక్కడలేకపోయుంటే నేను ఈ రోజున ఇక్కడ ఉండేవాడిని కానని కచ్చితంగా చెప్పగలను. నేను నిద్ర పోయేందుకు ప్రయత్నిస్తున్న సమ యంలో ఆమె నన్ను తట్టి లేపి తక్షణ కర్తవ్య బోధ చేసింది. బయటేం జరుగుతుందో చూసి రమ్మంటూ నన్ను పుర మాయించింది.
ఎట్టకే లకు మేం ఓడ డెక్ పైకి చేరేటప్పటికి చాలా కొద్ది మంది మాత్రమే అక్కడ ఉన్నారు. కింది కి వెళ్లి లైఫ్ బెల్టు ధరించమని ఎవరో చెప్పా రు. తిరిగి పైకి వెళ్లే టప్పటికి సిబ్బంది లైఫ్బోట్లను సిద్ధం చేస్తున్నారు. వాటిలో ఎక్కమని ఎవరో సూచించారు. లైఫ్ బోట్లను ఆశ్రయించిన కొద్ది మందిలో మేమూ ముందు వరసలో ఉన్నాం. నిజానికి టైటానిక్ నుంచి లైఫ్ బోట్ లో కొంచెం దూరం వెళ్లిన తర్వాతనే మాకు అసలు విషయం అర్థమైంది.మహాద్భుతమైన టైటానిక్ సముద్రాంతర్భాగంలోకి క్రమేపీ కలి సిపోవడం మాకళ్లెదుటే సాదృశ్యమైంది. రాత్రి 11.40 – 11.50 మధ్య టైటానిక్కు ప్రమా దం జరిగింది. ఏదో తగిలింది. తెల్లవారు ఝామున 2.22 కి అది పూర్తిగా మునిగిపోయింది.
మీ జాన్ అండ్ నెల్లి
టైటానిక్ మునకకు సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక ఉత్తరం ఇది. ఏదేమైనా సముద్రయాన చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటనగా ‘టైటానిక్’ దుర్ఘటన చరిత్ర పుటల్లో మిగిలిపోయింది.
టైటానిక్ గుంటూరు అనుబంధం..!
టైటానిక్లో భారతదేశం నుండి ప్రయా ణించిన ఒకే ఒక అమెరికన్ కుటుంబం గుంటూరుకు చెందిన అలెన్ బెకర్ కుటుం బం. గుంటూరులో క్రిస్టియన్ మిషనరీలో పనిచేసిన అలెన్ బెకర్ కుటుంబం గుంటూ రు నుండి అమెరికాకు తిరిగి వెళుతూ ఇంగ్లాడులో టైటానిక్ ఎక్కారు. అయితే ఈ దుర్ఘటనలో వీరు రక్షింపబడ్డారు.