ఎమ్మెల్యేల ఎర కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు… గట్టి షాక్ ఇచ్చింది. ఈ కేసుపై తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈ నెల 7వ తేదీన కేసీఆర్ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్పై ఈ నెల 8వ తేదీన సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. అయితే ఈ కేసులో స్టేటస్ కో ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషన్ పై నేడు విచారణలో భాగంగా హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీం సుముఖత చూపలేదు. కనీసం విచారణ పూర్తయ్యేంతవరకూ ఎవరినీ అరెస్ట్ చేయవద్దని సీబీఐకు ఆదేశాలు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్ధనపై కూడా స్పందించలేదు. సీబీఐను తాము కంట్రోల్ చేయలేమని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంటూ తదుపరి విచారణ ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.
ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంపై దర్యాప్తును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ తీర్పును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేస్లూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేల కేసు సీబీఐ చేతికి వెళ్తే ఉపయోగం ఉండదని, ఇప్పటి వరకు జరిగిన విచారణ అంతా… పక్కదారి పడుతుందని ఈనెల 7, 8 తేదీల్లో జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాదులు దుష్యంత్ దవే, సిద్ధార్థ లుత్రాలు ప్రత్యేకంగా వాదనలు వినిపించారు. వెంటనే హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని న్యాయస్ధానాన్ని కోరారు. అయితే స్టే ఇచ్చేందుకు సీజేఐ ధర్మాసనం నిరాకరించింది.