మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులైన ఒకరిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశమిచ్చింది. బుధవారం జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, బీఆర్ గవాయి, ఏఎస్ బొప్పన్నలతో కూడిన ధర్మాసనం… రాజ్యాంగంలోని 142 అధికరణ ద్వారా ఈ ఆదేశం జారీ చేసింది. ఈ కేసులో తన జీవిత ఖైదును సస్పెండ్ చేయాలని కోరుతూ పెరారివలన్( 47) వేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. దీంతో 31 ఏళ్ల తర్వాత పెరారివాలన్ తన జైలు జీవితానికి గుడ్బై చెప్పనున్నాడు. పెరారివాలన్ రిలీజ్కు రాష్ట్ర క్యాబినెట్ అంగీకరించిందని, ఇక ఆర్టికల్ 142 ప్రకారం ఆ నిందితుడిని రిలీజ్ చేయడం సమంజసమే అని సుప్రీం అభిప్రాయపడింది. రాజీవ్ గాంధీ హత్యకు వాడిన బాంబు పరికరాలను పెరారివాలన్ అందజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని 1991 మే 21వ తేదీన తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లో హత్య చేశారు. ఆ సమయంలో పెరారివాలన్ వయసు 19 ఏళ్లు. ఈ కేసులో దోషిగా తేలిన అతనికి 1998లో మరణశిక్షను ఖరారు చేశారు. ఆ తర్వాత 2014లో సుప్రీం ఆ శిక్షను జీవితకాల శిక్షగా మార్చింది. ఇక ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు అతనికి బెయిల్ను మంజూరీ చేసింది. తాజాగా విడుదల చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది.