పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరైనదే అని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. 2016 నవంబర్ 8న మోదీ ప్రభుత్వం పాత రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న సంచలన నిర్ణయంపై పలు విమర్శలు వచ్చాయి. కేంద్ర నిర్ణయాన్ని తప్పుపడుతూ మోదీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో 50కి పైగా పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. వీటన్నింటిని సోమవారం సుప్రీంకోర్టు కొట్టేసింది. నోట్ల రద్దులో ఎలాంటి లోటుపాట్లు జరగలేదని చెప్పింది.
సోమవారం ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును ప్రకటించింది. కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలు అయిన అన్ని పిటిషన్లను కొట్టేసింది. రూ. 1000, రూ.500 కరెన్సీ నోట్లు కార్యనిర్వాహక వ్యవస్థ యొక్క ఆర్థిక విధానం అయినందున నిర్ణయాన్ని మార్చలేవని తీర్పు చెప్పింది. నోట్ల రద్దుకు ముందు కేంద్ర, ఆర్బీఐ మధ్య సంప్రదింపులు జరిగాయని సుప్రీంకోర్టు పేర్కొంది. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ఇచ్చిన నోటిఫికేషన్ సరైనదే అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దామాషా( నలుగురు న్యాయమూర్తులు సమర్థించగా.. ఒక్కరు విభేధించారు) ప్రకారం నోట్ల రద్దు ప్రక్రియను కొట్టివేయలేవని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. నోట్ల మార్పిడికి నిర్దేశించిన 52 రోజుల వ్యవధి అసమంజసమని చెప్పలేమని ఆయన అన్నారు.
నోట్లరద్దును విచారించిన సుప్రీం ధర్మాసనంలో జస్టిస్ బీఆర్ గావాయ్, ఎస్ అబ్దుల్ నజీర్, ఎఎస్ బోపన్న, వి. రామసుబ్రమణియన్, బీవీ నాగరత్న ఉన్నారు. అయితే జస్టిస్ బీఆర్ గవాయ్ నోట్ల రద్దును సమర్థించగా.. జస్టిస్ నాగరత్న దీంతో విభేదించారు.