హిందువులు ఎంతో భక్తిశ్రద్దలతో పూజించే అయ్యప్ప స్వామిపై ఇటీవల బైరి నరేష్ అనే వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఘాటుగా స్పందించారు. “భారతదేశంలో పుట్టి హిందు జాతిని మేల్కోలిపే గొప్ప శక్తివంతమైన దేవాలయాల్లో శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం చాలా గొప్పది. అటువంటి దేవాలయాన్ని, అయ్యప్ప స్వామిని కించపరిచే విధంగా ఓ దుర్మార్గులు.. ఇతర మతాలకు అమ్ముడుపోయేవారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం దారుణం. మహనీయుడు, చాలా గొప్పవాడు ఈ దేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన అంబేద్కర్ని నమ్ముకున్న కొందరు కూడా.. ఇవాళ అయ్యప్ప స్వామిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ.. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు జరుగుతున్నాయి. దీనిని ఆపాలంటే ప్రభుత్వాలు కళ్లు తెరవాలని” అన్నారు.
అయ్యప్ప స్వామిపై ద్వేషపూరిత వ్యాఖ్యలు తగదని చెబుతూనే.. హిందూ దేవుళ్లపై దూషణలను అంత ఈజీగా తీసుకోవద్దని… ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని స్వరూపానందేంద్ర సూచించారు. మైనారిటీలే కాదు హిందువులు కూడా ఓటర్లే అని పార్టీలు, ప్రభుత్వాలు గుర్తించాలని అన్నారు. కాబట్టి హిందూ సమాజాన్ని కించపర్చేలా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారికి సరైన శాస్తి జరపాలన్నారు. వారిపై సరైన సెక్షన్లు పెట్టి జైల్లో కుక్కాలని సూచించారు. ఇటువంటి వ్యాఖ్యలు మరోసారి తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల్లో జరగకూడదని, ఆ విధంగా చర్యలు జరపాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు స్వరూపానందేంద్ర డిమాండ్ చేసారు.