ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రబోధానంద(70) ఈరోజు కన్నుమూశారు. ఆయన గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోజు ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయారు. ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రికి తరలించారు. ప్రబోధానంద తాడిపత్రి మండలంలోని అమ్మలదిన్నె కొత్తపల్లెలో 1950లో జన్మించారు. ఆయన అసలు పేరు పెద్దన్న చౌదరి. మొదట్లో ఆయన ఇండియన్ ఆర్మీలో వైర్లెస్ ఆపరేటర్గా పనిచేశారు. తరువాత తాడిపత్రిలో ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేశారు. ఆ సమయంలో ఆయుర్వేదంపై పుస్తకాలు రాశారు.
ఆధ్యాత్మిక అంశాలపై కూడా గ్రంథాలు రచించారు. తర్వాత ఆధ్మాత్మిక గురువుగా మారిపోయారు. చిన్నపొడమల గ్రామంలో శ్రీకృష్ణమందిరాన్ని స్థాపించారు. ఆధ్మాత్మిక భావనలను వివరిస్తూ ప్రబోధానంద అనేక పుస్తకాలు రాశారు. ప్రబోధానందకు, అనంతపురం టీడీపీ ఎంపీ దివాకర్ రెడ్డికి 2018లో గొడవలు జరిగాయి. వినాయక నిమజ్జన యాత్ర వివాదం వల్ల సీఐ గోరంట్ల మాధవ్ ప్రాచుర్యంలోకి వచ్చారు. నిమజ్జన యాత్ర విషయంలో దివాకర్ రెడ్డి పోలీసులు తీరును తప్పుబట్టారు. దీంతో గోరంట్ల మాధవ్ మీసం మెలేయడం చర్చనీయాంశం అయింది. ఆ తరువాత ఆయన పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై హిందూపురం నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు.