తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీజేపీ పార్టీ నాయకులకు సవాల్ విసిరారు. అధికారంలో ఉన్నాం కదా అని ఏది పడితే అది మాట్లాడుతామంటే ఊరుకోమని, దేశవ్యాప్త ఎన్నికలకు మేము సిద్దం- బీజేపీ సిద్ధమా, మీకూ దమ్ముందా అంటూ సవాల్ చేశారు. సనత్నగర్ బన్సీలాల్పేటలో ఆదివారం డబుల్ బెడ్ రూం ఇండ్లను వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.
శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..” కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, దేశవ్యాప్త ఎన్నికలకు బీజేపీ సిద్ధమా? మీకూ దమ్ముందా.. కేంద్ర మంత్రి హోదాలో ఉండి అమిత్ షా అలా మాట్లాడటం సరైన పద్దతి కాదు. కళ్లుండి చూడలేని కబోదులు బీజేపీ నాయకులు. ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారు. పేదల సొంతింటి కలను కేసీఆర్ సాకారం చేశారు” అని ఆయన అన్నారు.
అనంతరం తెలంగాణకు బీజేపీ ఏం ఇచ్చిందో అమిత్ షా చెప్పాలని వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ను ఎదుర్కొనేందుకు బండి సంజయ్ చాలన్న అమిత్ షా.. తెలంగాణకు ఎందుకొచ్చారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అప్పులు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ప్రధాని మోదీ దేశంలోని సంపదను అదాని, అంబానీలకు దోచి పెడుతున్నారని ప్రశాంత్ వేముల విమర్శించారు.