ఉక్రెయిన్లో చదువుతున్న ఓ తమిళ విద్యార్థి రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఉక్రెయిన్ సైన్యంలో చేరాడు. వివరాలు.. కోయంబత్తూరుకు చెందిన సాయి నికేశ్ రవిచంద్రన్ (21) 2018లో ఖార్కివ్లోని నేషనల్ ఏరోస్పేస్ యూనివర్శిటీలో చదువు నిమిత్తం వెళ్లాడు. అతని కోర్సు 2022 జులైలో పూర్తి కావాల్సి ఉంది. అయితే యుద్ధం మొదలయినప్పటి నుంచి సాయి నికేశ్కు తన కుటుంబంతో కమ్యూనికేషన్ తెగిపోయింది.
దీంతో తల్లిదండ్రులు భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించగా, వారి ద్వారా సాయి నికేశ్ని సంప్రదించగలిగారు. ఈ సందర్భంగా తాను ఉక్రెయిన్ సైన్యంలో చేరినట్లు కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. కాగా, ఇంతకు ముందు సాయి నికేశ్ భారత సైన్యంలో చేరాలనుకున్నాడు కానీ, ఎంపిక కాలేకపోయాడని అతని తల్లిదండ్రులు తెలపడం గమనార్హం.