కాంగ్రెస్ నుంచి తప్పుకుని అనూహ్యంగా బీజేపీలో చేరిన సినీనటి ఖుష్బూ తాను పార్టీ మారడంపై స్పందించారు. తనకు అందమే కాదు తెగువ కూడా ఉందని వ్యాఖ్యానించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నడుస్తున్న తీరు సరిగా లేకపోవడంతోనే తాను ఆ పార్టీకి గుడ్ బై చెప్పానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మారిపోయిందని.. ఆ పార్టీలో నేతలు మారిపోయారని వెల్లడించారు. అంతకుమించి తన నిష్క్రమణకు గల కారణాలను చెప్పలేనని పేర్కొన్నారు. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు తనకు బాధ్యతలు అప్పగించడంపై కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోందని మండిపడ్డారు. గత నాలుగేళ్లుగా స్థానిక నేతలు తనతో ఎలా ప్రవర్తిస్తున్నదీ చెబుతూనే ఉన్నా పట్టించుకునే పాపాన పోలేదు పార్టీ. జ్యోతిరాదిత్య సింథియా వెళ్లిపోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కబూర్లే చెప్పిందని దుయ్యబట్టారు.
మరోవైపు తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ కేఎస్ అళగిరి తనను తామరాకుపై నీటిబొట్టు అని అభివర్ణించడం పట్ల ఖుష్బూ ఘాటుగా స్పందించారు. ఇలాంటి స్త్రీద్వేష వ్యాఖ్యల గురించే తాను మొదట్నించి చెబుతున్నానని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను ఓ నటినే కావచ్చు.. కానీ అళగిరి ఎవరికీ పెద్దగా తెలియని వ్యక్తి అని ఎద్దేవా చేశారు. తాను ప్రజలను ఆకర్షించగలనని.. అళగిరి నాలా జనాకర్షక శక్తి ఉన్న వ్యక్తి కాదని తెలిపారు. అందుకే, తమకంటే తెలివైన, వాక్పటిమ ఉన్న మహిళను ఈ విధంగా ఎదుర్కోవాలని ప్రయత్నించినట్టున్నారని చెప్పారు. తనది గట్టి గుండె అని.. తాను అందగత్తెనే కాదు, తెగువ ఉన్నదాన్నని స్పష్టంచేశారు.