దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తుంది. మార్కెట్లో ఏ కొత్త వాహనం విడుదలైన వాహన ప్రియులు నచ్చిన వెంటనే క్షణం ఆలోచించకుండా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే పలు కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లో విడుదలై, ప్రజల నుంచి మంచి ఆదరణను పొందాయి. ఈ క్రమంలో ప్రముఖ కార్ల కంపెనీ టాటా.. కారు ప్రియులకు ఓ శుభవార్తను చెప్పింది.
టాటా కంపెనీ తాజాగా తయారు చేసిన ”నెక్సన్ ఈవీ ప్రైమ్”ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఎక్స్షో రూంలో ఈ కారు ధర రూ.14.99–17.5 లక్షల మధ్య ఉంది. ఈ కారు స్పెషల్ ఏంటంటే..ఒక్కసారి ఛార్జింగ్ పెడితే చాలు ఏకంగా 312 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. అంతేకాదు, ఈ కారులో 129 పీఎస్ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ ఏసీ మోటార్, 30.2 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
ఈ కారు ప్రత్యేకతల గురించి టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మార్కెటింగ్, సేల్స్ హెడ్ వివేక్ శ్రీవత్స మాట్లాడుతూ.. ”మల్టీ మోడ్ రీజెన్, క్రూజ్ కంట్రోల్, ఇండైరెక్ట్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, స్మార్ట్వాచ్ కనెక్టివిటీ వంటివి అదనంగా పొందుపరిచారు. ఈ ఫీచర్లు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ ద్వారా ఇప్పటికే పరుగెడుతున్న 22,000లకుపైగా నెక్సన్ ఈవీ కార్లకూ జోడించవచ్చు. జూలై 25 నుంచి సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ కార్యక్రమం అధీకృత సర్వీస్ కేంద్రాల ద్వారా ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఎలక్ట్రిక్ కార్ల రంగంలో టాటా వాటా దేశంలోనే 65 శాతంగా ఉంది” అని అన్నారు.