ఏపీ సీఎం జగన్కు చంద్రబాబు లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్కు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మూడు పేజీల లేఖ రాశారు. ప్రధానంగా కృష్ణా నదికి వరదల గురించి తన లేఖలో పేర్కొన్నారు. వరదల సందర్భంగా ప్రభుత్వం అన్ని విషయాల్లో విఫలమైందని విమర్శించారు. వరద నీటిని నియంత్రించడం నుంచి బాధితులను ఆదుకోవడం వరకు అన్నింటా ప్రభుత్వ నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.
ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలపై ఐఎండీ వంటి వాతావరణ సంస్థలు ముందే హెచ్చరించినా కూడా ఎందుకు నిర్లక్ష్యం చేసారంటూ ప్రశ్నించారు. ప్రకాశం బ్యారేజ్లో ముందే నీటి మట్టం తగ్గించి ఉంటే లంక గ్రామాలు వరద బారిన పడేవి కావని చంద్రబాబు పేర్కొన్నారు. కానీ, ప్రభుత్వం ఉన్నట్టుండి దిగువకు నీటిని వదలడంతో లంక గ్రామాలు ముంపుకు కారణమైందన్నారు. అమరావతిలోని తన ఇంటిపైకి డ్రోన్లు ఎగరేయడంపై ఉన్న ఆసక్తి వరద బాధితులపై లేదన్నారు. చివరికి రాజధానికి ముంపు ప్రమాదం ఉందని ప్రచారం చేశారని లేఖలో స్పష్టం చేశారు.