సాఫ్ట్వేర్ ఇంజినీర్.. జీతంలో 70 % ఊరి కోసం..
పుట్టిన ఊరి కోసం ఏదో ఒకటి చేయాలనే సంకల్పం చాలా మందిలోనే ఉంటుంది. కానీ ఆచరణలోకి వచ్చే సరికిః వెనకడుగు వేస్తారు. కానీ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాత్రం సొంత గడ్డ కోసం తన జీతంలోని 70 శాతం డబ్బును తన ఊరిలోని పరిసరాల పరిశుభ్రత కోసమే ఖర్చు చేస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటోంది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ముందుకు సాగుతూ ఒంగోలు నగరాన్ని క్లీన్ ఒంగోలుగా మార్చేస్తోంది.
ఒంగోలు పట్టణానికి చెందిన పొడపాటి తేజస్వి బీటెక్ చదువుతున్న సమయంలో పత్రికల్లో ఓ వార్తను చదివింది. ప్రకాశం జిల్లా చాలా వెనకబడిందని తెలిసి బాధపడింది.. దీనికి కారణం ఏంటని కనుక్కోవడంతో సిటీలో చాలా ప్రాంతాలు అశుభ్రంగా ఉన్నాయని గుర్తించారు. దీనికి ఎవరినో నిందిస్తూ.. అధికారుల కోసం ఎదురుచూడటం కంటే తానే పరిష్కారం చూపించాలనుకున్నారు. వెంటనే ‘భూమి ఫౌండషన్’ ఏర్పాటు చేశారు. దీని ద్వారా నగరంలోని పరిసరాలు శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో చెబితే వారు ముందు ఒప్పుకోనప్పటికీ తరువాత ఆమెకు అండగా నిలబడ్డారు.
2015లో 10 మంది స్నేహితులతో కలిసి ‘భూమి ఫౌడేషన్కు’ శ్రీకారం చుట్టారు తేజస్వి. ఈ బృందంలోని సభ్యులు నగరంలోని కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకొని వాటిని శుభ్రం చేస్తుంటారు. తరువాత అక్కడ రంగులు వేసి, పూల కుండీలు పెడతారు.. శుభ్రం చేసిన వెంటనే ‘వన్ గోల్ క్లీన్ ఒంగోలు’ అనే నినాదాన్ని రాస్తారు.. ఇది చూసిన చాలా మంది వారి ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. 10 మందితో ప్రారంభమైన భూమి ఫౌండేషన్లో ఇప్పుడు 3500 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. ఇలా భూమి ఫౌండేషన్ చేస్తున్న పనులు చూసి చాలా మంది బయట చెత్త పడేయటం, పోస్టర్లు అంటించడం మానేశారు. ఈ సంస్థ సేవలకు ప్రధాని మోడీ, అప్పటి సీఎం చంద్రబాబుతోనూ ఆమె ప్రశంసలు కూడా అందుకున్నారు.