వినోద్కు కేబినెట్ హోదా పదవి ఇచ్చిన కేసీఆర్
కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్కు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక పదవి ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఆయనను నియమించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై కేసీఆర్ సంతకం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ప్రణాళికా సంఘం కీలకమైనది కావడంతో అనుభవజ్ఞుడైన వినోద్ కుమార్ను ఉపాధ్యక్షుడిగా కేసీఆర్ నిర్ణయించారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి త్వరలోనే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
అన్ని శాఖలకు సంబంధించిన వ్యవహారాలను సమీక్షించి, ప్రతిపాదనలు తయారు చేసే కీలక బాధ్యతను కూడా కేసీఆర్.. వినోద్ కుమార్కు అప్పగించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కేబినెట్ హోదా కలిగి వుండడంతో పాటు కేబినెట్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడిగా ఉంటారు. వినోద్ కుమార్ ఈ పదవిలో మూడేళ్లు కొనసాగుతారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, పరిపాలనా అంశాల్లో అనుభవంతో పాటు తెలంగాణ రాష్ట్ర భౌగోళిక, ఆర్థిక, సామాజిక అంశాల పట్ల అవగాహన కలిగిన వినోద్ సేవలు పూర్తిగా వినియోగించుకోవాలనే ఈ నియామకం చేపట్టినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.