తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు.. తమ ప్రియతమన నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో ప్రజలు తమ అభిమాన నాయకుడికి తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానాన్ని చాటుకొంటున్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు.. రక్తదానం, సామూహిక వివాహాలు, ఆడబిడ్డలకు చీరల పంపిణీ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని గురువారం సిద్దిపేటలోని జయశంకర్ స్టేడియంలో సీఎం కేసీఆర్ కప్ సీజన్-3 టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, హీరో నాని, క్రికెటర్ అంబటి రాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన అంబటి రాయుడు.. తాను సీఎం కేసీఆర్కు పెద్ద ఫ్యాన్ని అని చెప్పుకొచ్చాడు.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్లో విజేతలకు ఎమ్మెల్సీ కవిత బహుమతులు అందించారు. గెలుపునకు చరిత్ర మలుపునకు మరో పేరు కేసీఆర్ అని కవిత పేర్కొన్నారు. అనేక కష్టాలు ఎదురైనా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడి సాధించారన్నారు. అటువంటి వ్యక్తి పుట్టినరోజును మరపురాని విధంగా ఉండాలని గత మూడేళ్లుగా రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని కవిత తెలిపారు.
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర అర్చక సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ అర్చక, ఉద్యోగులకు పిలుపునిచ్చారు. అర్చక, ఉద్యోగుల సమస్యలను తీర్చిన ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు.