తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో ఉన్న వ్యవసాయ మార్కెట్లో గురువారం ఏసీ మిరపకు మార్కెట్ చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాలు ధర ఏకంగా రూ.22,800 పలికింది. అల్లిపురానికి చెందిన రావూరి సత్యనారాయణ అనే రైతు ఏసీ రకం మిర్చిని పండించి, నిన్న 22 బస్తాలను మార్కెట్కు తీసుకొచ్చారు. క్వింటాలు ధర రూ. 22,800 చొప్పున అమ్ముడుపోవడంతో రైతు ఆనందంలో మునిగితేలాడు.
అనంతరం మార్కెట్ అధికారులు మాట్లాడుతూ..”ఖమ్మం మార్కెట్ చరిత్రలోనే మొదటిసారిగా ఏసీ రకం మిర్చిని రూ. 22,800 చొప్పున కొనుగోలు చేశాం. మార్కెట్కు మొత్తం 5,546 బస్తాల ఏసీ మిరప బస్తాలు రాగా, అందులో ఎండు మిరప 2,058 బస్తాలు, తాలు మిరప 265 బస్తాల సరుకు వచ్చింది. తేజ రకం మిర్చికి అత్యధిక ధర పలుకుతుండడంతో రైతులు శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసిన సరుకును కూడా విక్రయిస్తున్నారు. ఈ నెల 1న ఏసీ మిరప క్వింటాలుకు రూ.22 వేలు పలకింది. మార్కెట్లో నిన్న మిరప కనిష్ఠ ధర రూ. 17,600గా ఉండగా, నమూనా ధర రూ. 20 వేలు పలికింది” అని అన్నారు.