రాష్ట్రంలోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ సర్కారు శుభవార్త చెప్పింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు దినం ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని మహిళలందరికీ ఈ సెలవు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే మహిళలందరికీ స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
మహిళా ఉద్యోగులకు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నుంచి ఆదివారం ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రతి ఏటా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేను పురస్కరించుకుని మార్చి 8న రాష్ట్ర సర్కార్ మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ప్రకటిస్తోంది. ఈ సారి కూడా అలాగే సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 8న హోలీ పండుగ వేళ విద్యాసంస్ధలకు సెలవు ప్రకటిస్తూ ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఆ రోజు ఉమెన్స్ డే ఉండటంతో.. రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ సెలవు ప్రకటించింది.