తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ సంచలన కామెంట్స్ చేశారు. బాడీ షేమింగ్ చేసేవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నల్లగా ఉన్నానని అంటే.. అగ్గిలా మారతానని హెచ్చరించారు. తాజాగా చెన్నైలోని తాండయార్పేటలోని ఓ ప్రైవేట్ బాలికల పాఠశాలలో జరిగిన వార్షికోత్సవానికి తమిళిసై హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తన చేతుల మీదుగా బహుమతులు అందజేసి వారిని అభినందించారు. వారిలో స్ఫూర్తి నింపేందుకు తన జీవితంలోని కొన్ని సంఘటనలను పంచుకున్నారు.
అందులో భాగంగానే ఈ సమాజంలో కొందరు ఎలా ప్రవర్తిస్తారో, తనను ఉదాహారణగా చూపించారు. హేళనలకు తలొగ్గొద్దని, అగ్గిరవ్వలా మారాలని సూచించారు. తన రంగు నలుపు అని, తన నుదురు బట్టతలలా ఉందని కొంతమంది పదే పదే విమర్శలు చేస్తున్నారని.. ఇంకోసారి తనను నలుపు అంటే అగ్గిలా మారి వణికిస్తానని అన్నారు. తనను విమర్శించేవారు సైతం ఓర్వలేనంతగా ఉన్నత స్థాయికి చేరతానని వ్యాఖ్యానించారు. తనపై చేసే విమర్శలను పట్టించుకోనని అన్నారు.