తెలంగాణ రాకముందు 58 ఏండ్లలో ఈ రాష్ట్రంలో కేవలం మూడు మెడికల్ కాలేజీలుంటే.. తెలంగాణ ఏర్పడిన 8 ఏండ్లలో కేసీఆర్ ప్రభుత్వంలో 12 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకున్నామని తెలిపారు మంత్రి హరీశ్ రావు. వాటిల్లో 8 కాలేజీలను ఒక్క (2022)సంవత్సరంలోనే ఏర్పాటు చేశామని చెప్పారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పర్యటనలో మంత్రి.. స్థానిక సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కొత్తగా ఏర్పాటుచేసిన ఈ-లైబ్రరీని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. సంగారెడ్డి మెడికల్ కాలేజీని రికార్డ్ సమయంలో 7 నెలల్లోనే పూర్తిచేశామన్నారు. ఒక్క విద్యా సంవత్సరంలోనే రాష్ట్రంలో ఎనిమిది మెడికల్ కాలేజీ, హాస్పిటళ్లను ప్రారంభించుకున్నామని చెప్పారు. ఎయిమ్స్లో(AIMS) కంటే తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో ఎక్కువ సౌకర్యాలు కల్పించామన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి లక్షమందికి 19 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అన్ని మెడికల్ కాలేజీల్లో లైబ్రరీలు, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. రూ.16.5 కోట్లతో రాష్ట్రంలో మూడు ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్లను ప్రారంభించుకున్నామన్నారు. వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా న్యూట్రిషన్ కిట్లు అందించనున్నామని అన్నారు. మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ పట్ల ప్రభుత్వం కఠినంగా ఉంటుందని స్పష్టం చేశారు.