తెలంగాణలోని అన్ని పాఠశాలలకు మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొంటూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాధమిక, ప్రాధమికోన్నత, ప్రభుత్వ, ప్రైవేట్, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్కు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు క్లాసులు నిర్వహించాలని.. ఆ తర్వాత విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం అందించాలని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏప్రిల్ 24 వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి.
ఇదిలా ఉండగా.. పదో తరగతి విద్యార్ధులకు ఏప్రిల్ 3 నుంచి వార్షిక పరీక్షలు జరగనున్నందున వారికి మాత్రం ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ క్లాసులు నిర్వహించాలని తెలిపింది. ఈ మేరకు ప్రాంతీయ విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్.. జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పైన పేర్కొన్న ఆదేశాలను తప్పనిసరిగా అన్ని స్కూల్స్ పాటిస్తున్నాయో.. లేదో పర్యవేక్షించాలన్నారు.