నేటితో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. ఆఖరిరోజైన ఈ ఆదివారం శాసనసభ ముందుకు ద్రవ్య వినిమయ బిల్లు రానున్నది. బిల్లుపై ఉభయ సభల్లో చర్చ జరగనుంది. శాసనసభ ఆమోదించిన మూడు బిల్లులు, అనుబంధ అంచనా వ్యయంతో పాటు మండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక చేపట్టనున్నారు. ఈ నెల 6న ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అసెంబ్లీలో 2023-24 బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. శాఖలవారీగా బడ్జెట్ డిమాండ్లు, గ్రాంట్లపై శనివారం అర్ధరాత్రి వరకు అసెంబ్లీలో చర్చ కొనసాగడంతోపాటు ఆమోదం కూడా పొందాయి.
ద్రవ్య వినిమయ బిల్లును మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టనుండగా… బిల్లుపై చర్చకు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ సమాధానం ఇవ్వనున్నారు. మండలిలో హరీష్ రావు సమాధానం ఇస్తారు. ఈ బిల్లుపై శాసనసభ ప్రశ్నోత్తరాల్లో… బస్తీ దవఖానాలు, గురుకులాలు, హరితవనాలు, పునరుత్పాదక ఇంధన వనరులు, సమీకృత వ్యవసాయ మార్కెట్లు, మామిడి మార్కెట్, పంట రుణాల మాఫీ, కోతుల బెడద, అక్షరాస్యత అంశాలు చర్చకు రానున్నాయి.
ఇక కౌన్సిల్ ప్రశ్నోత్తరాల్లో… జీఎస్టీ పరిహారం, ఆర్టీసీచే హైస్పీడ్ డీజిల్ వినియోగం, భవన క్రమబద్దీకరణ , గురుకులాల్లో డిప్యూటీ వార్డన్ల నియామకం, దివ్యాంగులకు సంక్షేమ పథకాలు, జంట నగరాల్లో మెట్రో రైల్ విస్తరణ, పురావస్తు సంపద పరిరక్షణ, డిగ్రీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ అంశాలు చర్చకు రానున్నాయి.