ఈ నెలలో జరిగిన గిరిజన కుంభమేళా మేడారం సమ్మక్క, సారక్క జాతరలో భక్తులు అమ్మవార్లకు భారీగా కానుకులను సమర్పించుకున్నారు. మేడారం గద్దెల ప్రాగంణంలో మొత్తం 479 హుండీలను అధికారులు ఏర్పాటు చేశారు. హుండీలను తెరచిన అధికారులు గడిచిన వారం రోజుల నుంచి హన్మకొండలోని తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపంలో లెక్కింపులు చేస్తున్నారు. తుది గణాంకాల ప్రకారం మొత్తం హుండీల ద్వారా రూ.10,17,50,363 ఆదాయం వచ్చింది. 824 గ్రాముల బంగారం, 47.470 కిలోల వెండి ఆభరణాలు వచ్చాయి. 32 దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు కూడా హుండీల్లో లభించాయని, వాటిని మార్పిడి కోసం రిజర్వ్ బ్యాంకుకు పంపిస్తామని మేడారం గద్దెల ఈఓ రమేశ్ బాబు పేర్కొన్నారు.