ఈ నేరస్తులు సినిమాలను బాగా ఫాలో అయినట్టే వున్నారు. చేసిన తప్పుకు జైల్లో పడ్డారు. కేసు విచారణ దశలో వుంది. కానీ వాళ్ళు తప్పించుకోవాలనుకున్నారు. అందుకోసం వాళ్ళు సినిమాల్లోని సీన్లను తమ మైండ్లలో రివైండ్ చేసుకున్నారు. అందుకు పక్కా ప్లాన్ వేసుకున్నారు. విచారణ నిమిత్తం కోర్టుకు వెళ్ళారు. వెంటనే తమ ప్లాన్ను అమలు పరిచారు. బాంబ్ విసిరి ఎస్కేప్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే..
సినిమాను తలపించేలా జరిగిన ఈ ఎస్కేపింగ్ డ్రామా పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఓ నేరంలో ముగ్గురు కరుడుగట్టిన నేరస్తులు జైలుపాలయ్యారు. కోర్టులో విచారణ జరుగుతోంది. కోర్టు విచారణకు వెళ్లినప్పుడు తాము ఈజీగా తప్పించుకోవచ్చు అనుకున్నారు. అందుకోసం బాంబు పథకం రచించారు. కోర్టు ప్రాగంణంలో పోలీసుల మీద బాంబ్ దాడి చేశారు. బాంబ్ విస్ఫోటనంతో చుట్టుపక్కల వున్న జనాలు భయాందోళనలతో పరుగులు పెట్టారు.
కొద్దిసేపట్లోనే అక్కడంతా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇంకే వాళ్ళు ముగ్గురు పారిపోవడానికి బైక్ ఎక్కారు. ఆ కంగారులో బైక్ కూడా తొందరగా స్టార్ట్ అవలేదు. ఈ క్రమంలో పోలీసలు అలర్ట్ అయ్యారు. ముగ్గురిలో ఇద్దరు పారిపోయినా కర్ణబేరా అనే నేరస్తుడు పోలీసులకు చిక్కాడు. అతణ్ని పోలీసులు విచారించగా తమ బాంబ్ ప్లాన్ గురించి చెప్పాడు. వెంటనే పోలీసులు, ఆ ఇద్దరు నేరస్తులను పట్టుకోవడానికి చాలా వేగంగా రంగంలోకి దిగారు.