పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎస్బీ) అధికారులతో కుమ్మక్కై నీరవ్ మోదీ దాదాపు రూ.11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడిని సంగతి తెలిసిందే. దీంతో ఈ అవినీతి తిమింగలాన్ని పట్టుకోవడానికి ఈడీ, సీబీఐ రంగంలోకి దిగాయి. ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చే కొన్ని రోజుల ముందే.. జనవరి మొదటి వారంలోనే అతడు విదేశాలకు చెక్కేశారు.
కాగా సెలబ్రిటీ వజ్రాల వ్యాపారి అయిన నీరవ్ మోదీ ఆస్తులు, షోరూంలు, ఆఫీసులపై ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. నీరవ్ మోదీకి చెందిన గీతాంజలి జెమ్స్ షోరూంలలో కూడా దాడులు జరుగుతున్నాయి. గీతాంజలి జెమ్స్కు దేశవ్యాప్తంగా వీఐపీలు కస్టమర్లుగా ఉన్నారు. ఇప్పటికే గీతాంజలి జెమ్స్ యజమాని మెహిల్పై ఈడీ పీఎంఎల్ఏ కేసును నమోదుచేసింది. అంతేకాక పీఎన్బీ స్కాంలో మెహిల్ను నిందితుడిగా ఈడీ పేర్కొంది.హైదరాబాద్ రావిరాళ్లలో ఉన్న గీతాంజలి జెమ్స్ పార్క్పై ఈడీ దాడులు నిర్వహిస్తోంది. ఆయన ఇంట్లో, ఆఫీసుల్లో కూడా సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్, సూరత్, ముంబైలలో గీతాంజలి జెమ్స్ షోరూంలు ఉన్నాయి. హైదరాబాద్, సూరత్లలో నీరవ్ మోదీకి డైమాండ్ తయారీ కేంద్రాలున్నాయి. గత దశాబ్దకాలంగా గీతాంజలి జెమ్స్ పేరుతో నీరవ్ మోదీ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. హైదరాబాద్ రావిరాళ్ళ సెజ్లో అప్పటి ప్రభుత్వం ఆయనకు భూకేటాయింపులు చేసింది.
కుంభకోణం వెలుగులోకి రాగానే పీఎన్బీ షేరు భారీగా పడిపోయింది. దాదాపు రూ.8000 కోట్ల సంపదను ఈ బ్యాంకు ఇన్వెస్టర్లు పోగొట్టుకున్నారు. గీతాంజలి జెమ్స్ షేర్లు కూడా భారీగా పతనమవుతున్నాయి. మొత్తం 12 జాతీయ బ్యాంకులను నీరవ్ ముంచినట్టు కాంగ్రెస్ ఆరోపించింది. దేశం విడిచి పోయిన నీరవ్ మోదీ ప్రస్తుతం న్యూయార్క్లో ఉన్నట్టు అధికారులు ట్రేస్ చేశారు. ఈ కుంభకోణానికి పాల్పడిన ఎవరిన్నీ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని బ్యాంకు నిన్నటి సమావేశంలో హెచ్చరించింది.