సామాజిక మాధ్యమం ఫేస్బుక్ ఇకనుండి చిలక జోస్యం చెప్పనున్నది. ఎవరేపాటి ధనవంతులో ఇక ఫేస్బుక్ జ్యోతిష్యం చెప్పేస్తుంది. ఇందుకు సంబంధించిన టెక్నాలజీ పేటెంట్ కోసం ఫేస్బుక్ దరఖాస్తు చేసుకుంది. వర్కింగ్ క్లాస్, మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్ అనే మూడు క్లాస్ల ద్వారా ఫేస్బుక్ ఆటోమెటిక్గా ఈ విషయాన్ని గుర్తిస్తుంది. వారివారి ఆర్థిక స్థతిగతలను బట్టి వ్యాపార వర్గాల ఉత్పత్తులను వారి చెంతకు చేరవేసేందుకే ఈ సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఫేస్బుక్ పేర్కొంది.
యూజర్ల వయసు ఆధారంగా ఓ ప్రశ్న పత్రాన్ని రూపొందించిన ఫేస్బుక్ వాటిని యూజర్ల ముందు పెట్టి వివరాలు సేకరిస్తుంది. 20-30 ఏళ్ల మధ్య యువకులైతే ఇంటర్నెట్ వినియోగంపైనా, 30-40 ఏళ్ల మధ్య వారైతే సొంతింటికి సంబంధించిన ప్రశ్నలు, సందర్శించిన పర్యాటక ప్రదేశాలు తదితర వాటిపై ప్రశ్నలు సంధిస్తుంది. తమ వేతనానికి సబంధించిన ప్రశ్నకు జవాబును మాత్రం యూజర్లకే వదిలేస్తోంది. ఈ ప్రశ్నకు ఇష్టం ఉంటే సమాధానం చెప్పవచ్చు, లేదంటే లేదంటున్నారు.
ఈ క్రమంలో పేటెంట్ కోసం చేసుకున్న దరఖాస్తు ప్రకారం.. ఫేస్బుక్ ప్రత్యేకంగా ఓ సాంకేతికతను సిద్ధం చేసింది. యూజర్ల నుంచి ఇంటి వివరాలు, విద్యార్హతలు, ఇంటర్నెట్ వినియోగం మొదలగు వివరాలను సేకరించి వారి సామాజిక స్థితిగతులను చెప్పనుందన్నమాట.
అయితే ఫేస్బుక్ తమ యూజర్లు ఎటువంటి వారో తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది ? అన్న ప్రశ్నకు ఎఫ్బీ సమాధానం చెప్పింది. మా ప్రయత్నం వల్ల వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులను చాలా సులభంగా చేరుకునే అవకాశముందని తెలిపింది.