‘ తాడిని దన్నేవాడు ఒకడుంటే వాడి తల దన్నేవాడు ఒకడుంటాడు ’ అన్ట్టే తయారౌతోంది ఫేస్బుక్ పరిస్థితి. ఫేస్బుక్ను భయంతో చెమటలు పట్టించి, తన ఉనికికి విఘాతం కలిగించటానికి ఇన్స్ట్రాగ్రామ్, స్నాప్చాట్లు నడుం కట్టుకున్నట్టుగానే వుంది చూస్తుంటే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది ఖాతాదారులను కలిగివున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్కు ఇప్పుడు ఈ కొత్త భయం పట్టుకుంది. ముఖ్యంగా యువత నెమ్మదిగా ఎఫ్బీకి దూరమవుతున్నారు. చాలా మంది ఫేస్ బుక్ అంటే మొహం మొత్తి.. ఇన్స్ట్రాగ్రామ్, స్నాప్చాట్లను ఆశ్రయిస్తున్నారు. కొన్నేళ్ళ క్రితం ఆర్కుట్ను, ఫేస్బుక్ రావటం రావటమే దాన్ని భూస్థాపితం చేసింది. అప్పటివరకు చాలా మందికి ఆర్కుట్ తన సేవలు అందించింది.ఎప్పుడైతే ఎఫ్బీ వచ్చిందో సరిగ్గా అక్కడే ఆర్కుట్ అంతమైంది. ఇప్పుడు ఎఫ్బీ పరిస్థితి కూడా ఆర్కుట్లానే తయారయ్యేలా వుందని కొందరు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం యూఎస్లో ఫేస్బుక్కు 16.95 కోట్లు, ఇన్స్టాగ్రామ్కు 10.47 కోట్లు, స్నాప్చాట్కు 8.65 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. యువ ఖాతాదారులు (25 ఏళ్లలోపు వారు) వైదొలగుతుండగా, పెద్దలు మాత్రమే మిగులుతున్నట్టు ఓ ఆన్లైన్ సర్వే వెల్లడించింది. 18 నుంచి 24 ఏళ్ల వయసువారిలో 5.8శాతం మంది ఫేస్బుక్ను వదిలేశారని ‘ ఇమార్కెటర్ ‘ రిపోర్టు తెలిపింది. ముఖ్యంగా అమెరికాలో ఈ సమస్య ఫేస్బుక్కు ఎక్కువగా వుంది.
12 ఏళ్లలోపు వారిలో 9.3 శాతం, 12 నుంచి 17 సంవత్సరాల వయసువారిలో దాదాపు 6 శాతం మంది ఫేస్బుక్కు టాటా చెప్పారని పేర్కొంది. తదుపరి రెండు మూడేళ్ల వ్యవధిలో 25 ఏళ్లలోపున్న ఖాతాదారుల్లో 20 లక్షల మందిని ఫేస్బుక్ దూరం చేసుకోనుందని అంచనా వేసింది. ఇన్ స్టాగ్రామ్కు 18 లక్షల మంది, స్నాప్చాట్కు 19 లక్షల మంది కొత్త ఖాతాదారులు రానున్నారని తెలిపింది. స్నాప్చాట్కు యూత్ బాగా కనెక్ట్ అవుతోందని, 24 గంటల తర్వాత సందేశం అదృశ్యమయ్యే స్నాప్చాట్ చాలా మందిని ఆకట్టుకుంటున్నదని ‘ఇమార్కెటర్’ అనలిస్ట్ డెబ్రా అహో విలియంసన్ వెల్లడించారు.