ఇంటిని అద్దెకివ్వడమే కాకుండా కొన్నాళ్లపాటు బాగోగులు చూసిన యజమానికి ఘోర ద్రోహం తలపెట్టాడో యువకుడు. పగ తీర్చుకోవడానికి, దాంతోపాటు డబ్బు గుంజడానికి ఆ యజమాని ఐదేళ్ల కొడుకుని హత్య చేశాడు. శవాన్ని నెల రోజులుగా ఓ సూట్ కేసులో దాచాడు. ఈ ఘోరం ఢిల్లీలో జరిగింది.
గత నెల 7వ తేదీ నుంచి తమ బాబు ( అశిష్ ) కనిపించడంలేదని ఢిల్లీలోని స్వరూప్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు చిన్నారి తల్లిదండ్రులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గతంలో వారింట్లో అద్దెకున్న అవదేశ్ సఖ్యపై పోలీసులకు అనుమానం రావడంతో నాథూపురాలోని అతని ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.ఆశిష్ను చంపింది సఖ్య అని పోలీసులు వెల్లడించారు. చిన్నారిని నెల రోజుల క్రితమే హత్య చేసి, సూటుకేసులో కుక్కి తను నివసిస్తున్న గదిలో పెట్టాడు. పోలీసులు వెళ్లి సూటుకేసు తెరిచి చూడగా అశిష్ శవం గుర్తు పట్టరానిస్థితిలో వుంది. బాలుడి కిడ్నాప్ చేశానని, డబ్బులిస్తే వదిలేస్తానని ఆశిష్ తల్లిదండ్రులకు ఫోన్ చేయాలనుకున్నట్లు నిందితుడు చెప్పాడు.
గత ఎనిమిదేళ్ల నుండి సఖ్య.. అశిష్ వాళ్ళింట్లోనే అద్దెకు వున్నాడు. తొలుత అందరూ ఒకే ఇంట్లోనే వుండగా, ఐదేళ్ళ క్రితం సఖ్య.. నాథుపురాలోని ఇంట్లోకి మారాడు. సఖ్య వద్దకు వెళ్లొద్దని ఆశిష్కు చెప్పేవారు అతని తల్లిదండ్రులు. సఖ్య సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు.