భారతీయ రైల్వే సంస్థ దిగువశ్రేణి క్యాడర్లు, రిటైర్మెంట్ ఉద్యోగులకు విదేశీయాన సదుపాయాన్ని కల్పిస్తున్నది. ఇంత వరకు ఈ సదవకాశాన్ని కేవలం పైస్థాయి ఉద్యోగులు మాత్రమే పొందారు. కానీ ఇప్పుడు గ్యాంగ్మెన్లు, ట్రక్మెన్లు సహా ఇతర నాన్ గెడిజెట్ ఉద్యోగులకు ఎంచక్కా విదేశాలు చుట్టి వచ్చే అవకాశాన్ని కల్పిస్తోంది దక్షిణ మధ్య రైల్వే విభాగం.
100 మంది తొలిబ్యాచ్ ఈనెల 28న విమానంలో మలేషియా, సింగపూర్ బయలుదేరి వెళ్ళింది. సింగపూర్లో సెంటోసా, నైట్ సఫారి, కౌలాలంపూర్ నగరం సహా మలేషియాలో పెట్రోనాస్ టవర్స్, బటూ కేవ్స్, జెంటింగ్ హైల్యాండ్స్ను సందర్శించనున్నారు. ఇది పూర్తిగా విహార యాత్ర.
సంస్థలోని నాన్ గెజిటెడ్ సిబ్బందికి దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ ఓవర్సీస్ క్యాంప్ను నిర్వహించడం ఇదే తొలిసారని తెలిపారు.విదేశీ పర్యటనకు ప్రయాణ ఖర్చులో 25 శాతం ఖర్చును ఉద్యోగులు భరించాల్సి ఉండగా, 75 శాతం సిబ్బంది ప్రయోజనాల నిధి (ఎస్బీఎఫ్) నుంచి వాడుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే ఎస్సీఆర్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఉమాశంకర్ కుమార్ పేర్కొన్నారు.