ఇటు నుంచి విస్తారా ఎయిర్ లైన్స్ విమానం.. అటునుంచి ఎయిరిండియా విమానం దూసుకొస్తున్నాయి.. కొన్ని క్షణాల్లో రెండూ ఢీకొనేవే. అయితే ఎయిరిండియా విమానాన్ని నడుపుతున్న ఓ మహిళా పైలట్ చాకచక్యంగా వ్యవహరించింది. విమానాన్ని వంద అడుగుల కింది దించింది. దీంతో రెండు విమానాల్లోని 261 మంది ప్రాణాలకు ముప్పు తప్పింది. ఢిల్లీ నుంచి పూణె వెళ్తున్న విస్తారా ఎ-320 విమానం 29వేల అడుగుల ఎత్తులో ఎగిరింది. అదే సమయంలో ముంబై నుంచి భోపాల్కు వెళ్తున్న ఎయిరిండియాకు చెందిన ఎయిర్ బస్ ఏ-319 కూడా 27వేల అడుగుల ఎత్తులో ఎగిరిగింది. విస్తారా పైలెట్లు విమానాన్ని 27వేల అడుగుల కిందికి దించడంతో రెండు విమానాలు ఎదురుపడ్డాయి. విస్తారా విమానం కో పైలట్ ఆధీనంలో ఉంది. ఎయిర్ ఇండియా విమానాన్ని మహిళా కమాండర్,కెప్టెన్ అనుపమ కోహ్లీ నడుపుతోంది.
విస్తారా ఎయిర్ లైన్స్ విమానం మరింత దగ్గరగా రావడంతో ఎయిరిండియా విమానంలో డేంజర్ బెల్ మోగింది. విమాన ప్రయాణ దిశను మార్చాలని రాడార్ హెచ్చరికలు వచ్చాయి. దాంతో అనుపమ విమానాన్ని కుడివైపు తిప్పి 100 అడుగుల కిందికి తీసుకెళ్లింది. విస్తారా విమానం కూడా 600 అడుగులు కిందికి దిగి వెళ్లడంతో సెకన్ల కాలంలో పెద్ద ప్రమాదం తప్పింది. అనుపమను అందరూ అభినందించారు. ప్రమాద సమయంలో విస్తారా విమానంలో 152 మంది వుండగా, ఎయిర్ ఇండియా విమానంలో 109 మంది ప్రయాణీకులు ఉన్నారు.