చంద్రబాబు కుప్పం పర్యటన.. రాళ్లదాడులు.. పలువురికి గాయాలు..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో 3 రోజుల పర్యటనలో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా బుధవారం మధ్యాహ్నం రామకుప్పం మండలం కొల్లుపల్లిలో చేరుకోగా.. అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు సమక్షంలోనే వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నాయి. ఈ దాడుల్లో ఓ ఎస్సైతో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.
చంద్రబాబు పర్యటించే మార్గంలో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన జెండాలు ఆనుకొని వైసీపీ కార్యకర్తాలు తమ పార్టీ జెండాలను కట్టారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు ఆ జెండాలను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి డౌన్ డౌన్ చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. టీడీపీ వాళ్లు కూడా డౌన్ డౌన్ సీఎం అంటూ వారికి పోటీగా నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పాటు కర్రలతో దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. అయితే సమాచారం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు మరిన్ని బలగాలను అక్కడికి పంపి… ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది.
ఈ ఘర్షణపై స్పందించిన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం నా నియోజకవర్గం అని గుర్తు పెట్టుకోండి అంటూ వైసీపీ శ్రేణులకు హెచ్చరికలు జారీ చేశారు. కుప్పంలో అతిగా ప్రవర్తిస్తే వైసీపీ నేతల తోకలు కట్ చేస్తానంటూ ఆయన చురకలు అంటించారు. తన పర్యటనలో వైసీపీ జెండాలు కట్టడమేమిటని ప్రశ్నించిన చంద్రబాబు.. ఇది ప్రత్యర్థి వర్గాన్ని ఉసికొల్పడం కాదా? అని ప్రశ్నించారు.