ఆ హీరోయిన్ ఇంట్లో దొరికిన డబ్బు నాది కాదు: పార్థ ఛటర్జీ
నటి అర్పితా ముఖర్జీ ఇళ్లల్లో ఈడీ అధికారులు రికవరీ చేసిన డబ్బు తనది కాదని, తనపై కుట్రపన్నుతున్నారని పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్ మెంట్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి పార్థ ఛటర్జీ అన్నారు. తనపై ఎవరు కుట్ర పన్నుతున్నారో కాలమే సమాధానం చెబుతుందని తెలిపారు. వైద్య పరీక్షల కోసం జోకాలోని ఈఎస్ఐ హాస్పిటల్ కు పోలీసులు ఆదివారం ఆయనను తీసుకెళ్లారు. వాహనం దిగి హాస్పిటల్ కు వెళ్లిన సమయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.
‘‘ ఆ డబ్బు (రికవరీ) నాది కాదు. ’’ అని ఛటర్జీ అన్నారు. మీ పై ఎవరు కుట్రపన్నుతున్నారని ప్రశ్నించగా.. ‘‘ సమయం వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది ’’ అని ఆయన అన్నారు. మంత్రి వర్గం నుంచి తొలగించే చర్యపై అభిప్రాయాన్ని అడిగినప్పుడు ‘‘ ఆమె (మమతా బెనర్జీ) నిర్ణయం సరైనదే ’’ అని అన్నారు. ‘‘ఈ నిర్ణయం (నన్ను సస్పెండ్ చేయడం) నిష్పాక్షిక దర్యాప్తును ప్రభావితం చేయగలదు ’’ అని ఆయన చెప్పారు. కాగా ఇదే విషయంపై ఆయన శుక్రవారం భిన్న సమాధానం ఇచ్చారు. తాను కుట్రకు బలి అయ్యానని అన్నారు. సస్పెండ్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. గత గురువారం ఆయనను పార్టీ నుంచి కూడా స్పస్పెండ్ చేశారు.
కాగా, తన ఇళ్ల నుంచి ఈడీ స్వాధీనం చేసుకున్న రూ.50 కోట్లకుపైగా డబ్బు విద్యా శాఖ మాజీ మంత్రి పార్థా ఛటర్జీవేనని అర్పితా ముఖర్జీ తెలిపింది. టీచర్ల రిక్రూట్మెంట్, బదిలీలు, కాలేజీల గుర్తింపు అనుమతికి సంబంధించి ఆయన అందుకున్న లంచాలని ఈడీ దర్యాప్తులో వెల్లడించింది.