ప్రపంచ ఏడు వింతల్లో ఒకటిగా గుర్తింపు పొందిన తాజ్ మహల్ కట్టిన స్థలం మాదేనంటూ రాజస్థాన్ బీజేపీ ఎంపీ దివ్యకుమారి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆగ్రాలో తాజ్ మహల్ కట్టిన ప్రాంతం వాస్తవానికి జైపూర్ పాలకుడు, మా పూర్వీకులు జైసింగ్ది. అందుకు తగ్గ ఆధారాలు మా పూర్వీకుల రికార్డుల్లో ఉన్నాయి. అయితే షాజహాన్ దానిని స్వాధీనం చేసుకున్నాడు. ఆ కాలంలో న్యాయవ్యవస్థ, అప్పీలుకు వెళ్లే అవకాశం లేదు.
మా దగ్గర ఉన్న రికార్డులను పరిశీలిస్తే విషయం ఏంటో మీకే తెలుస్తుంది’ అని వెల్లడించారు. అంతేకాక, తాజ్ మహల్ కింద ఉన్న 22 గదులను తెరవాలన్న పిటిషన్ను దివ్యకుమారి సమర్ధించారు. ‘ఆ గదులు తెరచుకుంటే తాజ్ మహల్ కంటే ముందు ఏముండేదో అందరికీ తెలుస్తుంది. అక్కడ గుడి కూడా ఉండి ఉండవచ్చు. అందుకని ఏం ఉండేదో తెలుసుకునే హక్కు అందరికీ ఉంది’ అని అభిప్రాయపడ్డారు. అయితే తమ రాజవంశీకుల రికార్డులను తాను పూర్తిగా పరిశీలించలేదనీ, వాటిపై ఓ నిర్ధారణకు వచ్చిన తర్వాతే ఏం చేయోలో నిర్ణయించుకుంటామని స్పష్టం చేశారు.