ఆంధ్రప్రదేశ్లో గతకొన్ని రోజులుగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనుందని, ప్రస్తుతం ఉన్న కొంతమంది మంత్రులను తప్పించి, వారి స్థానంలో కొత్తవారిని నియమించనున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వార్తలన్నీ నిజం చేస్తూ, జగన్ ప్రభుత్వం త్వరలోనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈనెల 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ వివిధ శాఖల ఉన్నతాధికారులకు సోమవారం సమాచారమిచ్చారు.
సమీర్ శర్శ మాట్లాడుతూ.. ” ఏప్రిల్ 7వ తేదీన ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ నిర్వహించాలని ముందుగా నిర్ణయించాం. కానీ, ముఖ్యమంత్రి పర్యటనలో కొన్ని మార్పులు చోటుచేసుకోవడంతో మధ్యాహ్నానికి మారింది. నరసరావుపేటలో ఈ నెల 6న వాలంటీర్లకు సత్కార కార్యక్రమంలో సీఎం పాల్గొనాల్సి ఉంది. అయితే, జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్న నేపథ్యంలో రెండు రోజులపాటు ఆయన పర్యటించనున్నారు. దీంతో వాలంటీర్లతో కార్యక్రమాన్ని 6న కాకుండా, 7వ తేదీ ఉదయం ఏర్పాటు చేస్తారు. అందువల్ల మంత్రిమండలి సమావేశాన్ని ఆ రోజు ఉదయం కాకుండా మధ్యాహ్నానికి మార్చారు” అని అన్నారు.
అయితే, 11వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణం మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరెవరిని తప్పిస్తున్నారో జగన్ 7న కేబినెట్ సమావేశంలో వెల్లడించనున్నారని తెలిసింది. దీంతో ఆయా మంత్రులు రాజీనామా చేయాల్సి ఉంటుంది. వారి రాజీనామా విషయాన్ని ముఖ్యమంత్రి 8న గవర్నర్ను కలిసి వివరించి, వారి స్థానంలో కొత్తవారిని తీసుకునేందుకు అనుమతించాలని కోరతారని సమాచారం. గవర్నర్ ఆమోదం తెలపగానే అదేరోజు కొత్తగా మంత్రిమండలిలోకి వచ్చే వారికి సమాచారమిస్తారని అంటున్నారు. 11న ఉదయం 11.31 గంటలకు వెలగపూడిలోని సచివాలయ భవన సముదాయం పక్కనున్న స్థలంలో ఏర్పాటు చేయనున్న వేదిక పై కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు.