సుప్రీం కోర్టు చరిత్రలో మూడోసారి మహిళా న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటైంది. జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనాన్ని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం ఏర్పాటు చేశారు. ఈ మహిళా బెంచ్ ఈ రోజు(గురువారం) పలు కేసులను విచారించనుంది. ఇందులో వైవాహిక గొడవలకు సంబంధించి 10 బదిలీ పిటిషన్లు, మరో 10 బెయిల్ పిటిషన్లు ఉన్నాయి.
కాగా.. ఇలా పూర్తిగా మహిళా న్యాయమూర్తులతో సుప్రీంకోర్టులో ధర్మాసనం ఏర్పాటవడం చరిత్రలో ఇది కేవలం మూడోసారి. మొదటిసారిగా 2013లో జస్టిస్ రంజనా ప్రసాద్ దేశాయ్, జస్టిస్ జ్ఞాన సుధా మిశ్ర లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఏర్పాటై పలు కేసుల విచారణలు చేపట్టింది. ఆ తర్వాత.. 2018లో జస్టిస్ ఆర్. భానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీ లతో కూడిన మహిళా ధర్మాసనం ఏర్పాటైంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 27 మంది జడ్జీలు ఉండగా.. వీరిలో ముగ్గురు మహిళా జడ్జీలు ఉన్నారు. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ బేలా త్రివేది గతేడాది ఆగస్టు 31న ఒకేరోజు సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరు ప్రమాణం చేసే నాటికి జస్టిస్ ఇందిరా బెనర్జీ కూడా సుప్రీంకోర్టు జడ్జీగా ఉన్నారు. అయితే ఆమె ఈ ఏడాది అక్టోబరులో పదవీ విరమణ చేశారు. ఇక జస్టిస్ బి.వి. నాగరత్న.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రేసులో ఉన్నారు. 2027లో ఆమె 36 రోజుల పాటు సీజేఐగా బాధ్యతలు చేపట్టే అవకాశముంది. అదే జరిగితే.. సుప్రీంకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె అపూర్వ ఘనత సాధిస్తారు.